టీమిండియా డాషింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ సిక్సర్ల రికార్డును ఓ అనామక బ్యాటర్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రియాకు చెందిన కరణ్బీర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ 151 ఇన్నింగ్స్ల్లో 205 సిక్సర్లు కొడితే.. కరణ్బీర్ సింగ్ కేవలం 59 ఇన్నింగ్స్ల్లోనే హిట్మ్యాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
తాజాగా హంగేరితో జరిగిన మ్యాచ్లో కరణ్బీర్ సింగ్ ఈ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతడు కేవలం 57 బంతుల్లోనే 164 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 12 భారీ సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లో కొట్టిన సిక్సర్లతో టీ20 అంతర్జాతీయాల్లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 207కు చేరింది.
టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో కరణ్బీర్ సింగ్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో యూఏఈకి చెందిన మహ్మద్ వసీమ్ (196), టీమిండియా తాజా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (179), ఇంగ్లండ్ వెటరన్ జోస్ బట్లర్ (173) ఉన్నారు.
తాజా ఇన్నింగ్స్లో కరణ్బీర్ సింగ్ మరో భారీ రికార్డుకు తృటిలో కోల్పోయాడు. టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 172 పరుగుల రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. ఈ రికార్డును కరణ్బీర్ (164) కేవలం ఎనిమిది పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. కరణ్బీర్ రికార్డు ప్రదర్శనకు అబిదుల్లా కొత్వా అనే ఆటగాడి సునామీ ఇన్నింగ్స్ (26 బంతుల్లో 93 నాటౌట్; 2 ఫోర్లు, 12 సిక్సర్లు) తోడవ్వడంతో ఆస్ట్రియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక జట్టు స్కోరు. 2024లో గాంబియాపై జింబాబ్వే చేసిన 344/4 మాత్రమే దీనికంటే ఎక్కువ.
ఇక కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హంగేరి ఏ దశలోనూ పోరాటం ప్రదర్శించలేక 165 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆస్ట్రియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
30 ఏళ్ల కరణ్బీర్ సింగ్ ఆస్ట్రియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టాపార్డర్ బ్యాటర్గా, మీడియం పేసర్గా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఇప్పటివరకు 60 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 48.71 సగటున, 175.41 స్ట్రయిక్రేట్తో 2533 పరుగులు చేశాడు. అతని ఖాతాలో నాలుగు సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 39 వికెట్లు కూడా తీశాడు.
గత ఏడాది కూడా కరణ్బీర్ మరో విశేష రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రికార్డును అధిగమించాడు. 2025లో కేవలం 32 ఇన్నింగ్స్ల్లోనే 1,488 పరుగులు చేసి అసోసియేట్ దేశాల క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పేరిట ఉన్న మరో అరుదైన రికార్డును అధిగమించడం ద్వారా ప్రపంచ టీ20 క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.


