సిరాజ్, లంక బ్యాట‌ర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం! | Heated Argument Between Siraj And Niroshan Dickwella During India Vs Sri Lanka 1st Test, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

సిరాజ్, లంక బ్యాట‌ర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం!

Aug 18 2026 9:22 AM | Updated on Aug 18 2026 10:05 AM

Heat Argument Between-Siraj-Niroshan-Dickwella-1st Test Live Match

Photo Credit: BCCI Twitter

గాలే వేదికగా శ్రీలంక‌, టీమిండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టులో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, లంక బ్యాట‌ర్ నిరోష‌న్ డిక్‌వెల్లా మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మూడో రోజు ఆట‌లో టీమిండియా ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ, లంక బ్యాట‌ర్లు డిక్‌వెల్లా, దినూష‌లు త‌మ జిడ్డు బ్యాటింగ్‌తో భార‌త బౌల‌ర్ల‌ను ఇబ్బందిపెట్టారు. 

దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్‌వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవ‌ర్లో ఇది చోట‌చేసుకుంది. 54వ ఓవ‌ర్‌లో బౌలింగ్‌కు వ‌చ్చిన సిరాజ్ డిక్‌వెల్లా బ్యాట్‌ను టార్గెట్‌గా చేసుకొని అదే ప‌నిగా బంతుల‌ను విసిరాడు. ప‌దే ప‌దే త‌న‌ను రెచ్చ‌గొట్టేలా బంతులు వేయ‌డంతో స‌హ‌నం కోల్పోయిన డిక్‌వెల్లా సిరాజ్‌తో మాట‌ల యుద్ధానికి దిగాడు. 

'బంతుల‌ను స‌రిగ్గా వెయ్యు' అని డిక్‌వెల్లా అన‌గా.. సిరాజ్ 'స‌రే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్ర‌తిస్పందించాడు. అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య మాటామాట పెర‌గ‌డంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్ద‌రిని పంపించేయ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోష‌న్ డిక్‌వెల్లా మంచి ప్ర‌ద‌ర్శ‌నే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 ప‌రుగులు సాధించిన అనంత‌రం ప్ర‌సిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డిక్‌వెల్లా కెరీర్‌లో ఇది 23వ అర్ధ‌శ‌త‌కం. అయితే 55 టెస్టులాడిన‌ప్ప‌టికీ డిక్‌వెల్లా ఖాతాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సెంచ‌రీ కూడా లేక‌పోవ‌డం గ‌మనార్హం. అత‌డి అత్య‌ధిక టెస్టు స్కోరు 96గా ఉంది. 

మ్యాచ్ విష‌యానికొస్తే శ్రీలంక 284 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. సోనాల్ దినూష (100) సెంచ‌రీ చేయ‌గా, డిక్‌వెల్లా (80) అర్ధ‌సెంచ‌రీ చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో మాన‌వ్ సుతార్ 4 వికెట్లు తీయ‌గా, జ‌డేజా మూడు, కుల్దీప్‌, ప్ర‌సిధ్‌, సిరాజ్ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 462 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. ప‌డిక్క‌ల్ సెంచ‌రీతో చెల‌రేగగా, కేఎల్ రాహుల్‌, జురెల్ అర్ధ‌శ‌త‌కాలు సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement