యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో 'డబ్లిన్ గార్డియన్స్' కెప్టెన్గా భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. డబ్లిన్ జట్టుకు అశ్విన్ సారథిగానే కాకుండా మెంటార్గా కూడా తన సేవలను అందించనున్నాడు. ఈ విషయాన్ని డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా డబ్లిన్ ఫ్రాంచైజీని భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
"యూరప్లోని యువ ప్రతిభను వెలికితీయడానికి ఈటీపీఎల్ ఒక గొప్ప వేదిక. అందుకే నేను ఈ లీగ్లో భాగమయ్యాను. డబ్లిన్లో ఇప్పటికే క్రికెట్కు మంచి ఆదరణ ఉంది. ఇక అశ్విన్ వంటి అనుభవజ్ఞుడు దొరకడం మా జట్టు ఆదృష్టం. అతడు మా జట్టు కెప్టెన్గా, మెంటార్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
క్రికెట్ విషయాల్లో నేను జోక్యం చేసుకోను. మైదానంలో వ్యూహాలు, నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ అశ్విన్కే ఉంటుందని" ద్రవిడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఈ టీ20 టోర్నీని క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నారు.
ఈ లీగ్లో మొత్తంగా 6 ఫ్రాంచైజీలు తలపడనున్నాయి. మిచెల్ మార్ష్, మాక్స్వెల్, శాంట్నర్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. అంతేకాకుండా ఈ లీగ్లో ద్రవిడ్తో పాటు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈటీపీఎల్ తొలి సీజన్ ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది.
ఫ్రాంచైజీల వివరాలు ఇవే
డబ్లిన్ గార్డియన్స్ (కెప్టెన్: ఆర్. అశ్విన్, యజమాని: రాహుల్ ద్రవిడ్)
అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ (కెప్టెన్: మిచెల్ మార్ష్, సహ యజమాని: స్టీవ్ వా)
ఎడిన్బర్గ్ కాజిల్ రాకర్స్ (కెప్టెన్: మిచెల్ సాంట్నర్)
గ్లాస్గో కాస్మిక్ (యజమాని: క్రిస్ గేల్)
ఐరిష్ వోల్వ్స్ (కెప్టెన్: గ్లెన్ మాక్స్వెల్)
రోటర్డామ్ డాకర్స్ (కెప్టెన్: ఫాఫ్ డు ప్లెసిస్, యజమాని: జోంటీ రోడ్స్)
చదవండి: IND vs ENG: బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్


