28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్‌ పట్టనున్న ఏబీ డివిలియర్స్‌ | AB De Villiers Return To Cricket With World Championship Of Legends League | Sakshi
Sakshi News home page

28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్‌ పట్టనున్న ఏబీ డివిలియర్స్‌

Jun 25 2025 3:50 PM | Updated on Jun 25 2025 4:48 PM

AB De Villiers Return To Cricket With World Championship Of Legends League

సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ (AB DE Villiers) మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2025 (World Championship Of Legends) లీగ్‌ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ (South Africa Champions) జట్టులో జాయిన్‌ కానున్నాడు. ఈ లీగ్‌లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్‌ ఆమ్లా, క్రిస్‌ మోరిస్‌, అల్బీ మోర్కెల్‌, వేన్‌ పార్నెల్‌, హార్డస్‌ విల్యోన్‌, ఆరోన్‌ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.

2021 నవంబర్‌లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్‌ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో టైటాన్స్‌ లెజెండ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.

ఆ మ్యాచ్‌ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్‌ పట్టనున్నాడు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్‌లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.

కాగా, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌ 2025 ఇంగ్లండ్‌ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్‌, నార్తంప్టన్‌, లీడ్స్‌, లీసెస్టర్‌ నగరాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. 

ఈ లీగ్‌లో ఇది రెండో ఎడిషన్‌. గతేడాది ఈ లీగ్‌ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్‌ సింగ్‌ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్‌ పఠాన్‌ 30 పరుగులు చేసి భారత్‌ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్‌బర్గ్‌లో అతను వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. 

ఏబీడీకి ఐపీఎల్‌లోనూ ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్‌ల్లో 151.68 స్ట్రైక్-రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement