చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రపంచ రికార్డు | Shreyas Iyer Breaks Ab de Villiers World Record 1st Player In History To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రపంచ రికార్డు

Jul 10 2026 11:43 AM | Updated on Jul 10 2026 11:54 AM

Shreyas Iyer Breaks Ab de Villiers World Record 1st Player In History To

PC: BCCI

ఇంగ్లండ్‌ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్‌ వేదికగా గురువారం ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత జట్టు 0–3తో కోల్పోయింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా... తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. దీంతో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.

అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వ్యక్తిగతంగా మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.

డివిలియర్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు
ఈ క్రమంలోనే శ్రేయస్‌ అయ్యర్‌.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌ గడ్డ మీద కెప్టెన్‌ హోదాలో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌ 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20లో 37 పరుగులు చేసిన కెప్టెన్‌ సాబ్‌.. మూడో టీ20లో మాత్రం ఐదు పరుగులకే అవుటయ్యాడు. తాజాగా నాలుగో టీ20లో 80 పరుగులతో సత్తా చాటి.. ఇప్పటికి మొత్తంగా 190 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు
👉శ్రేయస్‌ అయ్యర్‌ (ఇండియా)- 2026లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 190 పరుగులు (రెండు అర్ధ శతకాలు)
👉ఏబీ డివిలియర్స్‌ (సౌతాఫ్రికా)- 2017లో మూడు మ్యాచ్‌లలో కలిపి 146 పరుగులు (ఒక అర్ధ శతకం)
👉ఆరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా)- 2020లో మూడు మ్యాచ్‌లలో కలిపి 125 పరుగులు
👉జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 2024లో రెండు మ్యాచ్‌లలో కలిపి 123 పరుగులు (రెండు అర్థ శతకాలు)
👉బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- 2021లో మూడు మ్యాచ్‌లలో కలిపి 118 పరుగులు (ఒక అర్ధ శతకం)

కోహ్లి రికార్డు సమం
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ గడ్డ మీద టీ20 సిరీస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గానూ శ్రేయస్‌ అయ్యర్‌ నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు నమోదు చేసిన కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి (80 నాటౌట్‌) రికార్డును కూడా శ్రేయస్‌ సమం చేశాడు. 

కాగా ఐర్లాండ్‌ పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది. కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్‌ జట్టు చేతిలో టీమిండియా 2-0తో వైట్‌వాష్‌ అయింది. తాజాగా ఇంగ్లండ్‌కు సిరీస్‌ను చేజార్చుకుంది.

చదవండి: ఆఖరి బంతికి సింగిల్‌... భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement