శ్రేయస్‌కు అండగా నిలబడ్డ సోదరి | Shresta Iyer Drags Kohli, Tendulkar And Gill As Examples To Defend Shreyas Iyer Amid Captaincy Criticism, Read Story Inside | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌కు అండగా నిలబడ్డ సోదరి

Jul 9 2026 12:03 PM | Updated on Jul 9 2026 12:45 PM

Shresta Iyer Drags Kohli, Tendulkar, Gill To Defend Shreyas Iyer Amid Captaincy Slump

భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి అండగా నిలుస్తూ, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్‌లను ఉదాహరణగా చూపించి విమర్శలకు సమాధానం ఇచ్చింది.

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో యూరప్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు విజయవంతంగా నడిపించిన శ్రేయస్, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 0-2తో ఓడిపోగా, ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ పరాజయం పాలవడంతో కెప్టెన్‌గా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు.

ఈ నేపథ్యంలో ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన శ్రేష్ఠ అయ్యర్, "విరాట్ కోహ్లీ ఒక లెజెండ్, రోహిత్ శర్మ ఒక లెజెండ్, సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. వాళ్లు కూడా తమ కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఓడిపోయారు. కానీ ప్రతిసారీ శ్రేయస్‌నే విమర్శిస్తే సమస్య అతనిలో కాకుండా విమర్శించే వారిలోనే ఉండొచ్చు" అని వ్యాఖ్యానించింది.

అయితే శ్రేష్ఠ చేసిన ఈ పోలికలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నాలుగు వన్డేల్లో రెండింట్లో జట్టుకు విజయాలు అందించాడు. 

విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ ఆరంభంలో తొలి ఓటమి తర్వాత వరుస విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ తన తొలి వన్డే సిరీస్‌లో శ్రీలంకపై 2-1తో విజయం అందించగా, శుభ్‌మన్ గిల్ కూడా కెప్టెన్‌గా తన తొలి టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ శ్రేయస్‌ను దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నెటిజన్లు శ్రేయస్‌ను దిగ్గజాలతో పోల్చొద్దని చెప్పినప్పటికీ.. శ్రేష్ఠ మాత్రం​ తన సోదరుడిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. "శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు. అతడిలో చాలా సామర్థ్యం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు అతడే భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందుతాడని నేను బలంగా నమ్ముతున్నాను" అని పేర్కొంది.

ఇదిలా ఉండగా, ప్రారంభ వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు జట్టు యాజమాన్యం విశ్వాసం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టుతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో శ్రేయస్‌కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement