భారత్తో ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు
17 ఏళ్ల కెరీర్లో ఇంగ్లండ్ తరఫున 260 అంతర్జాతీయ మ్యాచ్లు
మహిళల వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా 12 సెంచరీలు
2017 మహిళల ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర
మహిళల టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున తొలి డబుల్ సెంచరీ సాధించిన ఘనత
భారత్తో జరగనున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇంగ్లండ్ మహిళల సీనియర్ బ్యాటర్ టామీ బ్యూమాంట్ ప్రకటించింది. దీంతో దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన ఆమె అంతర్జాతీయ కెరీర్కు తెరపడనుంది.
35 ఏళ్ల బ్యూమాంట్ 2009లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి 260 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 7000 పైచిలుకు పరుగులు చేసింది. వన్డేల్లో అత్యధికంగా 12 సెంచరీలు బాది, ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచింది. అలాగే టెస్ట్ల్లో, టీ20ల్లో తలో సెంచరీ చేసి, ఓవరాల్గా 37 అర్ద సెంచరీలు నమోదు చేసింది.
2017లో స్వదేశంలో జరిగిన మహిళల ప్రపంచకప్లో ఇంగ్లండ్ టైటిల్ గెలవడంలో బ్యూమాంట్ కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నీలో అత్యధికంగా 410 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకుంది.
2023 మహిళల యాషెస్ సందర్భంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాపై 208 పరుగులు చేసి మహిళల టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున తొలి డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. అలాగే మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఇద్దరు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లలో ఒకరిగా, మొత్తం ఇంగ్లండ్ క్రికెటర్లలో ఐదుగురిలో ఒకరిగా నిలిచింది.
రిటైర్మెంట్ నిర్ణయంపై స్పందించిన బ్యూమాంట్, "దాదాపు 17 ఏళ్ల పాటు ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. చిన్నప్పుడు క్రికెట్పై ప్రేమ పెరిగినప్పుడు ఇంగ్లండ్ తరఫున ఆడతానని కూడా ఊహించలేదు. ఇప్పుడు ఎంతోమంది బాలికలు, బాలురకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. తర్వాతి తరం ఆటగాళ్లకు ఈ బాధ్యతను అప్పగించే సమయం ఆసన్నమైంది" అని తెలిపింది.
"లార్డ్స్లో జరగనున్న ఈ టెస్టు మహిళల తొలి టెస్టు కావడం మరింత ప్రత్యేకం. ఇలాంటి చారిత్రాత్మక వేదికపై నా అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకడం ఆనందంగా ఉంది. ఇకపై దేశవాళీ క్రికెట్లో కొనసాగుతాను. ఇన్నేళ్లుగా నన్ను ప్రోత్సహించిన అభిమానులు, కోచ్లు, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు" అని పేర్కొంది.
కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య ఏకైక టెస్ట్ జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇదే తొలి మహిళల టెస్ట్ మ్యాచ్.


