నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్‌ అయ్యర్‌ | Happy with my performance but When we came on to bowling: Shreyas Iyer | Sakshi
Sakshi News home page

నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్‌ అయ్యర్‌

Jul 10 2026 8:24 AM | Updated on Jul 10 2026 9:00 AM

Happy with my performance but When we came on to bowling: Shreyas Iyer

శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI)

టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 3-0తో సిరీస్‌ సొంతం చేసుకోగా.. టీమిండియా వరుసగా రెండో టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది.

ఓటమికి కారణం అదే
ఈ నేపథ్యంలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా ఓటమిపై స్పందించాడు. ‘‘మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్‌పై 158 అనేది కచ్చితంగా కాపాడుకోగలిగే స్కోరైతే కాదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్‌ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

మిడిల్‌ స్టంప్‌, లెగ్‌ స్టంప్‌ మీదకు బంతులు వేయమని మా బౌలర్లకు చెప్పాను. అలా అయితే బ్యాటర్లు బౌండరీలు రాబట్టడం కష్టతరమవుతుంది. అయితే, మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాము. ఎప్పుడైతే మా వ్యూహాన్ని కొద్దిగా మార్చామో ఆ సమయంలో వాళ్లు పరుగులు పిండుకున్నారు.

నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?
అయితే, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. కానీ గెలుపునకు నా ఇన్నింగ్స్‌ ఉపయోగపడలేదంటే దానికి ఎటువంటి అర్థం ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్‌లోనైనా ఆటంకాలు అధిగమించి అనుకున్న ఫలితం రాబట్టగలమనే అనుకుంటున్నాం.

పొరపాట్లు సహజమే
ప్రస్తుతం జట్టు సంధి దశలో ఉంది. మా వల్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్‌లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత తొందరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం.

బలంగా తిరిగి వస్తాము
మా జట్టులో క్విక్‌ లెర్నర్స్‌ ఉన్నారు. కచ్చితంగా విదేశీ గడ్డ మీది పరిస్థితులను అర్థం చేసుకుని.. వికెట్‌ను సరిగ్గా అంచనా వేసి మరింత బలంగా తిరిగి వస్తారని నమ్ముతున్నా’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా బ్రిస్టల్‌ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

శ్రేయస్‌ మెరిసినా..
నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 158 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో శివం దూబే (22) మాత్రమే ఇరవై పరుగులు దాటాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి పని పూర్తి చేసింది.

ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ అజేయ అర్ధ శతకం (59*)తో రాణించగా.. హ్యారీ బ్రూక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 79 నాటౌట్‌)తో మెరిశాడు. ఇక ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు.. తాజాగా నాలుగో టీ20లో గెలిచి ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్‌ గెలుచుకుంది. కాగా అంతకుముందు టీమిండియా ఐర్లాండ్‌ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement