టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్
బ్రిస్టల్: భారత క్రికెట్ జట్టు తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్ల మైలురాయిని అందుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. ఈ అరుదైన ఘనతను సహచర ఆటగాళ్లు, కోచ్లు, కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు అక్షర్ వెల్లడించాడు. ఇంగ్లండ్తో నాలుగో టి20 అక్షర్ కెరీర్లో 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్. ఈ సందర్భంగా బీసీసీఐ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో అక్షర్ తన 11 ఏళ్ల క్రికెట్ ప్రయాణాన్ని వివరించాడు.
‘నేను మొదటిసారి జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు వంద మ్యాచ్లు ఆడతానని ఊహించలేదు. ఈ ఇంగ్లండ్ పర్యటన నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సిరీస్లోనే టి20ల్లో వంద వికెట్ల మైలురాయిని దాటాను. ఇప్పుడు వంద టి20 మ్యాచ్లు. ఇది నాకెంతో ప్రత్యేకమైన రోజు. ఈ మైలురాయిని చేరుకోవడం కేవలం నా ఒక్కడి కృషి కాదు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన జట్టు సభ్యులు, కోచ్లకు ఇందులో భాగస్వామ్యం ఉంది. భారత్ తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడాలనేది ప్రతి ప్లేయర్ కల. అలాంటిది వంద మ్యాచ్లు అంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను’ అని అక్షర్ తెలిపాడు.
కెరీర్ ఆరంభంలో తక్కువ మ్యాచ్లు ఆడిన అక్షర్... ఆ తర్వాతా పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ‘తొలి ఐదారేళ్లలో 15 మ్యాచ్లు మాత్రమే ఆడాను. కానీ 2021 నుంచి జట్టులో నిలకడగా అవకాశాలు వచ్చాయి. వాటిని వినియోగించుకుంటూ ముందుకు సాగా. 2024, 2026 టి20 ప్రపంచకప్లు మనమే గెలిచాం. ఆ రెండింట్లోనూ సభ్యుడిగా ఉండటం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు వందో మ్యాచ్ ఆడుతున్న తరుణంలో అన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ... మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటా.
నా తొలి మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతంరం మరింత మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. కెరీర్ ఆరంభంలో ప్రతిదానికి ఆవేశపడేవాడిని. కానీ ఇప్పుడు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నా... ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటంపై దృష్టి పెట్టా. ఏ ఆటగాడైనా తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే మరింత మెరుగవుతాడు’ అని అక్షర్ వివరించాడు.


