టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత స్నిన్నర్గా (ఓవరాల్గా నాలుగో భారత బౌలర్గా) రికార్డుల్లోకెక్కాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడినా అక్షర్ బంతితో రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.
బ్రూక్ వికెట్ అక్షర్కు టీ20ల్లో 100వ వికెట్. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 98 మ్యాచ్లు ఆడిన అతడు.. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 736 పరుగులు కూడా చేశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్దీప్ సింగ్ 134 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా 121 వికెట్లు, హార్దిక్ పాండ్యా 114 వికెట్లు, అక్షర్ పటేల్ 100 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్
191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.


