ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించలేకపోయింది. లీగ్ దశ చివరి వరకు రేసులో ఉన్నా, పంజాబ్ కింగ్స్ ఈ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అక్షర్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీ ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 7 విజయాలు, 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
ఢిల్లీని ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయినా, కెప్టెన్ అక్షర్ పటేల్ వ్యక్తిగతంగా ఓ భారీ మైలురాయిని తాకాడు. ఐపీఎల్లో అత్యంత అరుదైన 2000+ పరుగులు, 100+ వికెట్లు, 100+ సిక్సర్ల క్లబ్లో చేరాడు. అక్షర్కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (3469 పరుగులు, 178 వికెట్లు, 121 సిక్సర్లు), కేకేఆర్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (2653, 123, 223) మాత్రమే ఈ అరుదైన ట్రిపుల్ ఫీట్ను సాధించారు.
కేకేఆర్తో జరిగిన చివరి లీగ్ దశలో మ్యాచ్లో అక్షర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 2 సిక్సర్లు బాదడంతో అతడి సిక్సర్ల సంఖ్య 100కు చేరింది. దీంతో అతడు జడేజా, రసెల్ సరసన చేరాడు.
ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో (బ్యాటంగ్లో 39 పరుగులు, బౌలింగ్లో ఓ వికెట్, ఫీల్డింగ్లో 2 క్యాచ్లు) సత్తా చాటిన అక్షర్ తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ గెలిచినా ఢిల్లీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే నిన్ననే ఈ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది (లక్నోపై పంజాబ్ గెలుపుతో).
ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. రేపు (మే 26) జరుగబోయే తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనుండగా.. 27న జరుగబోయే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ అమీతుమీ తేల్చుకుంటాయి.


