PC: BCCI
హంబన్టోటా వేదికగా శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో భారత అండర్–19 జట్టు పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక జట్టు 2–1తో చేజిక్కించుకుంది.
కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం భారత్ అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో వన్డేలో మాత్రం శ్రీలంక భారత్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
వినీత్ సెంచరీ
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జూనియర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. వీకే వినీత్ (VK Vineeth- 136 బంతుల్లో 131; 13 ఫోర్లు, 3 సిక్స్లు) శతకంతో చెలరేగగా... లక్ష్య (63 బంతుల్లో 61; 7 ఫోర్లు) హాఫ్సెంచరీ సాధించాడు.
ఇక లంక బౌలర్లలో సెత్మిక సెనెవిరత్నె 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. గింహాన్ మెండిస్ రెండు వికెట్లు తీయగా.. కవిజ గమాగే ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక అండర్–19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెనునగొడా హాఫ్ సెంచరీ (67)తో అలరించగా.. చమిక హీనతిగల అజేయ అర్ధ శతకంతో మెరిశాడు.
ఆఖరి బంతికి సింగిల్ తీసి
కేవలం 68 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో చమిక 84 పరుగులు సాధించాడు. లతీంద్ర ఆకాశ్తో కలిసి అజేయంగా నిలిచి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఐదో బంతికి సిక్సర్ కొట్టిన చమిక.. ఆఖరి బంతికి సింగిల్ తీసి లంక జట్టు గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైన భారత్ సిరీస్ను 1-2తో చేజార్చుకుంది.


