స్వదేశంలో శ్రీలంక అండర్-19తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. గతేడాది కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ను గెలిచిన జట్టులో సభ్యురాలి ఉన్న భవిక అహిరేను కెప్టెన్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టీ20 సిరీస్ రెండింటిలోనూ భారత జట్టును ఆమె ముందుండి నడిపించనుంది.
అదేవిధంగా భవికకు డిప్యూటీగా మహక్ నర్వాసే వ్యహరించనుంది. ఇక శ్రీలంకతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం దీయా యాదవ్కు చోటు దక్కింది. కానీ ఆమెను టీ20లకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో 16 ఏళ్ల దీయాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఆమెకు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు భారత జెర్సీలో సత్తాచాటేందుకు దియా సిద్దమైంది. కాగా ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక అండర్-19 టీమ్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. చెన్నై, పుదుచ్చేరి వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి.
టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్
టీ20 సిరీస్ (చెన్నై): జూన్ 22, జూన్ 24, జూన్ 27 (మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభం)
వన్డే సిరీస్ (పుదుచ్చేరి): జూన్ 30, జూలై 3 (ఉదయం 9:00 గంటలకు), జూలై 6 (మధ్యాహ్నం 2:00 గంటలకు)
భారత అండర్-19 టీ20 జట్టు:
భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, తనిష్క శర్మ, ఈశ్వరి అవసరే, అవ్ని చౌదరి, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, మణియార్ మైత్రి, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).
భారత అండర్-19 వన్డే జట్టు:
భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, దీయా యాదవ్, ఈశ్వరి అవసరే, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, విధి పర్మార్, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).


