రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్‌! | Reports-Gurnoor-Will-Replace-If-Bumrah-Ruled-out-Vs SL-Test Series | Sakshi
Sakshi News home page

రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్‌!

Jul 27 2026 2:00 PM | Updated on Jul 27 2026 2:05 PM

Reports-Gurnoor-Will-Replace-If-Bumrah-Ruled-out-Vs SL-Test Series

Photo Credit: BCCI Twitter

జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా త‌ర్వాతి సిరీస్ శ్రీలంక‌తో ఆడ‌నుంది. లంక ప‌ర్య‌ట‌న‌లో ఈసారి వైట్‌బాల్ సిరీస్‌కు బదులుగా సంప్ర‌దాయ టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త్ జ‌ట్టును మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించ‌నుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజాలు తిరిగి టెస్టుల్లో ఆడ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. 

అయితే లంక‌తో టెస్టు సిరీస్‌కు స్పీడ‌స్ట‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా దూర‌మయ్యే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒక‌వేళ లంక‌తో టెస్టు సిరీస్‌కు దూర‌మైతే అత‌డి స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న‌ది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల లంక‌-ఏ జ‌ట్టుతో జ‌రిగిన అన‌ధికారిక టెస్టులో 10 వికెట్లు ప‌డ‌గొట్టి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపిక‌లో ముందు వ‌రుస‌లో ఉన్నాడు. 

స్వ‌దేశంలో ఆఫ్గ‌న్‌తో జ‌రిగిన ఏకైక టెస్టుకు ఎంపికైన‌ప్ప‌టికీ గుర్నూర్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే అఫ్గానిస్తాన్తో జ‌రిగిన వ‌న్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వ‌ని గుర్నూర్‌, లంక‌తో సిరీస్‌లో బుమ్రా స్థానంలో ఆడే అవ‌కాశాలున్నాయి. బుమ్రా దూర‌మైతే మాత్రం సిరాజ్‌, ప్ర‌సిధ్ భార‌త పేస్ బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించ‌నున్నారు.

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదిక‌గా రెండో వ‌న్డే స‌మయంలో మోకాలి గాయంతో బాధ‌ప‌డ్డాడు. దీంతో చివరి వ‌న్డేకు దూర‌మ‌య్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో అత‌డి మోకాలు వాపు ఉంద‌ని తేలింది. దీంతో త‌దుప‌రి ప‌రీక్ష‌ల కోసం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. 

ఈ లెక్క‌న బుమ్రా త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మైతే లంక‌తో సిరీస్‌కు అత‌డు దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హ‌ర్షిత్ రానా, నితీశ్ కుమార్‌రెడ్డి, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు కూడా గాయాల‌తో బాధ‌ప‌డుతూ లంక‌తో టెస్టు సిరీస్ ఆడ‌డం అనుమానంగా మారింది. 

టీమిండియా 2017లో చివ‌రిసారి లంక‌లో టెస్టు సిరీస్ ఆడింది. అప్ప‌టి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్‌లో ఆతిథ్య లంక జ‌ట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గ‌డ్డ‌పై స‌రికొత్త స‌వాల్‌కు సిద్ధ‌మ‌యింది.

Read: ‘అగార్కర్‌ వింటున్నావా? వైభ‌వ్‌ను రోహిత్‌కు జ‌తగా పంపాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement