ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో మొదలయ్యే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లంక పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బుమ్రా మెకాలి గాయానికి గురయ్యాడు.
దీంతో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేకు జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ప్రముఖ స్పోర్ట్స్ రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి వెల్లడించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిందంట.
ఆ తర్వాత బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయనున్నాడు. అక్కడ వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే అతడి ఎంపికపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.
ఏదేమైనప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే లంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్కు భారీ షాక్ అనే చెప్పాలి.
ఎందుకంటే లంకతో టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో జరిగింది. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే.
ఇక ఈ సిరీస్కు బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడు తొలి టెస్ట్కు కాకపోయిన రెండో టెస్టులోనైన ఆడే అవకాశముంది.


