దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో అసోసియేట్ జట్ల నుంచి ప్రాతినిధ్యం వహించే ముగ్గురు డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మూడు స్థానాల కోసం ఐదుగురు పోటీ పడగా...18 ఏళ్లుగా డైరెక్టర్గా కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాజా (సింగపూర్) ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దాంతో ఐసీసీలో 2008 నుంచి సాగుతున్న ఆయన సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది.
గురుమూర్తి పళని (ఫ్రాన్స్–35 ఓట్లు), ముబాషిర్ ఉస్మానీ (యూఏఈ–26 ఓట్లు), రూడీ వాన్ వూరెన్ (నమీబియా–26 ఓట్లు) గెలుపొందగా... ఇమ్రాన్ ఖాజా (23 ఓట్లు), మహీంద్ర వల్లిపురం(మలేసియా–19 ఓట్లు) పరాజయం పాలయ్యారు.
కాగా రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగుతారు. ఐసీసీలో 16 మంది సభ్యుల డైరెక్టర్ల బృందంలో ఈ ముగ్గురికి చోటు దక్కుతుంది. వీరిలో ఒకరు ఐసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేస్తారు. విజేతలకు ఐసీసీ చైర్మన్ జై షా ప్రత్యేక అభినందనలు తెలిపారు.


