ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆడాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో మెరవాలని కోరుకోని ప్లేయర్ ఉండరు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రభుత్వ నిర్ణయం కారణంగా బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ ఏడాది కోల్పోయారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈవెంట్ నుంచే జట్టు నిష్క్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.
దౌత్యపరమైన ఉద్రిక్తతలు
అయితే, టోర్నీ ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని.. ప్రపంచకప్ ఆడేందుకు అక్కడకు వెళ్లమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) కొత్త రాగం ఎత్తుకుంది.
ప్రభుత్వ నిర్ణయం.. కాదు కాదు ఆటగాళ్లేనంటూ..
తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీని కోరింది. అయితే, బీసీబీ వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఇందుకు సరేనన్న ఐసీసీ.. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్కప్లో ఆడించింది.
అయితే, నాటి బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. టోర్నీ నుంచి తప్పుకోవాలన్నది తొలుత ప్రభుత్వ నిర్ణయమని చెప్పి.. ఆ తర్వాత తమ ఆటగాళ్లే దేశం కోసం భారత్లో ఆడలేదంటూ బాంబు పేల్చాడు. సర్వత్రా విమర్శలు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు.
భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా..
ఈ చేదు అనుభవాల గురించి ప్రపంచకప్-2026 బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన లిటన్ దాస్ తాజాగా స్పందించాడు. తాము పాకిస్తాన్లో తుపాకుల మధ్య క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటిది భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్రంగా కలచివేసిందన్నాడు.
ప్రథోమ్ అలోతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు మాతో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. మీరేం కోరుకుంటాన్నరో చెప్పండని అడిగారు. ప్రతి ఆటగాడు వరల్డ్కప్ ఆడాలనే అనుకున్నాడు. కానీ బోర్డుతో యుద్ధానికి దిగడం ఎవరికీ ఇష్టం లేదు.
పాకిస్తాన్లో ఆడాము.. అంతకంటే ప్రమాదకరమా?
కేవలం ప్రపంచకప్ టోర్నీ ఆడాలన్నదే మా కల. కానీ వాళ్లు భారత్లో భద్రత లేదని అన్నారు. అప్పుడు నేను నా వాదన వినిపించాను. ‘పాకిస్తాన్లో మేము క్రికెట్ ఆడాము. అప్పుడు గదుల వెలుపల తుపాకీలతో నిలబడి మాకు రక్షణ ఇచ్చారు.
ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ (భారత్) ఉంటాయా?’ అని అడిగాను. కానీ వాళ్లు మాత్రం వినలేదు. తమకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నారు. ఆటగాళ్లుగా వాళ్లు ఏం చెబితే మేము అదే వినాలి కదా!’’ అని లిటన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టి
కాగా బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీసీఐతో సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ను నియమించింది.
పదవి చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన తమీమ్ ఇక్బాల్.. బోర్డు తరఫున బీసీసీఐకి లేఖ రాయించాడు. ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.
ఏదేమైనా పాత ప్రభుత్వం వల్ల తాము ఎంతో నష్టపోయామని.. వారి అనుచిత నిర్ణయం వల్ల వరల్డ్కప్ ఆడే అవకాశం కోల్పోయామని ఆటగాళ్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఐసీసీ గట్టిగానే మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఆతిథ్య టీమిండియా విజేతగా నిలిచి... ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
చదవండి: అర్జున్ టెండుల్కర్ అదరగొట్టాడు


