జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం పాలైన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఓడి సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న బంగ్లాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది.
కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలుత ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగ్గా.. ఊహించని రీతిలో ఆతిథ్య జట్టు బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
వన్డే సిరీస్ జింబాబ్వేదే
అనంతరం హరారేలో సోమవారం తొలి వన్డే జరగ్గా.. జింబాబ్వే బంగ్లాదేశ్పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై గురువారం జరిగిన ఉత్కంఠపోరులోనూ జింబాబ్వేనే పైచేయి సాధించింది.
బంగ్లాను 13 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే ఓపెనర్ బెన్ కర్రాన్ అజేయ సెంచరీ (111*)తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
జరిమానా విధించిన ఐసీసీ
ఇక జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా బంగ్లాకు జరిమానా విధించినట్లు ప్రకటన విడుదల చేసింది.
‘‘హరారేలో గురువారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ వారి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నాం.
నిర్ణీత సమయంలో తమకు కేటాయించిన ఓవర్లు పూర్తి చేయనందున ఈ మేరకు జరిమానా విధించాము’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా జింబాబ్వే- బంగ్లాదేశ్ మధ్య శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఇందుకు హరారే వేదిక.


