బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(80 నాటౌట్) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు.
పవర్ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికి మిడిల్ ఓవర్లలో అయ్యర్ మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ముఖ్యంగా ఆల్రౌండర్ శివమ్ దూబే అయితే గల్లీ క్రికెటర్ కంటే దారుణంగా ఆడాడు.
ఇంగ్లండ్ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులకు దూబే ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. 23 బంతులు ఎదుర్కొని కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. అతడి జిడ్డు బ్యాటింగ్ కారణంగానే భారత్ ఆఖరిలో పరుగులు సాధించలేకపోయిందని అతడు మండిపడ్డాడు.
ఇంగ్లండ్ పిచ్లపై ఆడేందుకు దూబే భయపడుతున్నట్లు అనిపిస్తుంది. తొందరగా అవుట్ అయ్యి పెవిలియన్కు వెళ్లిపోవాలన్నట్లగా అతడు బ్యాటింగ్ చేశాడు. అతడి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తీవ్రంగా ఇబ్బందిపడుతున్న బ్యాటర్లలో దూబే ఒకడు.
ఒకటో రెండు సిక్స్లు కొట్టి అవుట్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో అయితే మరి చెత్తగా ఆడాడు. అతడు బౌలింగ్ కూడా ఎక్కువగా చేయడం లేదు. నేనే గనుక సెలక్షన్ కమిటీలో భాగంగా ఉంటే దూబేను పక్కనపెట్టి అతడి స్థానంలో కేఎల్ రాహుల్ను తీసుకొస్తాను అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.


