లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్-భారత మహిళల జట్లు తలపడుతున్నాయి. లార్డ్స్ మైదానం ఒక మహిళల టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్తో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఓ అరుదైన మైలు రాయిని అందుకుంది.
భారత్ తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మూడో మహిళా క్రికెటర్గా రికార్డు మంధాన సృష్టించింది. 2013లో బంగ్లాదేశ్పై టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మంధాన.. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 300 మ్యాచ్లు ఆడింది.
భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకోవడంలో మంధానది కీలక పాత్ర. మొత్తం 434 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్గా ఆమె నిలిచింది. మంధాన ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తోంది.
హర్మన్ ప్రీత్కౌర్ తర్వాత ఆమె భారత మహిళల జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. టీమిండియా తరపున టెస్టుల్లో 635 పరుగులు చేసిన స్మృతి.. వన్డేల్లో 5,411, టీ20ల్లో 4,538 పరుగులు నమోదు చేసింది.
కాగా భారత్ తరపునే కాదు ఓవరాల్గా ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ ప్రీత్ కౌర్(374) అగ్రస్దానంలో ఉండగా.. తర్వాత స్ధానాల్లో సూజీ బేట్స్(370), ఎలీస్ పెర్రీ(349), మిథాలీ రాజ్(333) ఉన్నారు.
ఇక ఏకైక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మంధాన 55 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తోంది.
చదవండి: నేపాల్తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్కు ప్రమోషన్!


