సహజమిది.. స్వరం విప్పండి | Smriti Mandhana opens up on playing cricket on periods | Sakshi
Sakshi News home page

సహజమిది.. స్వరం విప్పండి

Jul 8 2026 12:33 AM | Updated on Jul 8 2026 12:33 AM

Smriti Mandhana opens up on playing cricket on periods

ఇది నొప్పి కాదు. ఇది వేదన. తెలిసీ మాట్లాడని నిర్లక్ష్యం. గ్రౌండ్‌లో గోల్డ్‌ కోసం పరిగెత్తే మహిళ... ప్యాడ్‌ కోసం మాత్రం మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది. స్మృతి మంధాన టెస్ట్‌ మ్యాచ్‌ మధ్యలో ఆపి చెప్పింది. అంతర్జాతీయ అథ్లెట్లు ఎన్నోసార్లు ఎలుగెత్తారు. కానీ మన ఊరి అకాడమీలో స్కూల్‌ గ్రౌండ్‌లో ఇంకా అదే భయం. ‘మరక పడుతుందేమో’ ‘కోచ్‌ ఏమనుకుంటారో’ ‘చాన్స్‌పోతుందేమో’ ఈ భయాలతో ఎంతోమంది చాంపియన్లు కలలకు నీళ్లు వదులుకుంటున్నారు. పీరియడ్స్‌ బలహీనత కాదు. దాచాల్సిన సిగ్గు కాదు. ఇది ఆరోగ్యం. ఇది హక్కు. అందుకే ఇది మాట్లాడాల్సిన సమయం. మౌనం వీడాలి.  మహిళా క్రీడాకారిణి ఆరోగ్యం కోసం– ఇప్పుడే మాట్లాడు! 
# Period is Not a Pain

‘‘ఒక టెస్ట్‌ మ్యాచ్‌ లో బ్యాటింగ్‌ చేస్తుండగా సడన్‌గా  పీరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. వైట్‌ జెర్సీ డ్రెస్‌.. అంపైర్‌ వద్దకు వెళ్లి ‘శానిటరీ ప్యాడ్‌ మార్చుకోవడానికి వెళ్లాలి’ అని చెప్పాను. భారత్‌కు ఆడుతున్నప్పుడు వ్యక్తిగత నొప్పి కంటే జట్టు బాధ్యతే మా ముందుంటుంది. అయినా ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం అవసరం. ఒక మహిళా క్రికెటర్‌ క్రీడలో ప్రత్యర్థుల ఆటతీరు, వాతావరణ పరిస్థితులు, క్రికెట్‌ గ్రౌండ్‌ గురించి మాత్రమే కాదు పీరియడ్స్‌ గురించి కూడా 
చాలా క్యాజువల్‌ గా మాట్లాడే పరిస్థితి ఉండాలి. ’’ – స్మృతి మంధాన, భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌

ఈ వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులపై చర్చకు దారితీశాయి. ఆమె తన అనుభవాన్ని ఓపెన్‌గా చెప్పడం ద్వారా పీరియడ్స్‌ గురించి మాట్లాడటం తప్పు కాదని స్పష్టం చేశారు. అలాగే చైనా స్విమ్మర్‌ ఫు యువాన్ హుయ్, బ్రిటన్‌ రన్నర్‌ ఈలిష్‌ మెక్‌కోల్గన్, హాకీప్లేయర్‌ ఒలింపిక్‌ స్వర్ణవిజేత సామ్‌ క్వెక్‌ వంటి అంతర్జాతీయ అథ్లెట్లు కూడా పీరియడ్స్‌ అనేవి దాచాల్సిన విషయం కాదని, మహిళల శారీరక వాస్తవాలను అర్థం చేసుకునేలా క్రీడావ్యవస్థ మారాలని కోరారు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం
పోటీ సమయంలో పీరియడ్స్‌ వస్తాయేమో అని మానసిక ఒత్తిడినే ఎదుర్కొంటారు.పోటీరోజు పీరియడ్స్‌ వస్తాయేమో అని, యూనిఫామ్‌ పై మరకలు పడతాయేమోననే భయం, ఇతరులు ఎలా స్పందిస్తారన్న ఆందోళన... ఇవన్నీ వారి ఆటతీరుపై ప్రభావం చూపవచ్చు. అందుకే స్పోర్ట్స్‌ సైకాలజీ కూడా మహిళా క్రీడాకారిణుల శిక్షణలో భాగం కావాలి. పీరియడ్స్‌ గురించి బహిరంగంగా మాట్లాడగల వాతావరణం ఏర్పడితే ఈ ఒత్తిడి తగ్గుతుంది. 

పీరియడ్స్‌ ఆగిపోతే..
కొన్ని క్రీడల్లో బరువు తగ్గవలసి ఉంటుంది. అందుకోసం అధిక వ్యాయామం చేస్తూ, తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల కొందరు మహిళా అథ్లెట్లలో పీరియడ్స్‌ నెలల తరబడి ఆగిపోతాయి. ఇది మంచి సంకేతం కాదు. హార్మోన్ల అసమతుల్యతకు, ఎముకల శక్తి తగ్గడానికి, అలసట, గాయాల ప్రమాదం పెరగడానికి, భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది. అందుకే రుతుక్రమం ఆగిపోవడాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి తప్పనిసరి.. 
ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళా అథ్లెట్ల కోసం ప్రత్యేక ఆరోగ్య విధానాలు అమలవుతున్నాయి. రుతుచక్రాన్ని నమోదు చేసే యాప్‌లు, వ్యక్తిగత శిక్షణ ప్రణాళికలు, స్పోర్ట్స్‌ గైనకాలజిస్టులు, ప్రత్యేకపోషకాహార నిపుణులు, స్పోర్ట్స్‌ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటున్నారు.

⇒  మన దేశంలోనూ కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళా క్రీడాకారిణులకు ఇప్పటికీ సరైన అవగాహన, శానిటరీ సదుపాయాలు, వైద్య సహాయం సరిగ్గా అందడం లేదు. ఈ అసమానతను తగ్గించడం అత్యవసరం.
⇒  పీరియడ్స్‌ గురించి మాట్లాడితే అది సిగ్గు కాదు. శరీర ఆరోగ్యంపై మాట్లాడటం తప్పనిసరి అవసరం. స్పోర్ట్స్‌ అకాడమీలు, స్కూళ్లు, కాలేజీలు, స్పోర్ట్స్‌ అథారిటీలు ..

ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కోచ్‌లకు కూడా మహిళల శారీరక ఆరోగ్యంపై శిక్షణ ఇవ్వాలి.
ఏ దేశమైనా మహిళా అథ్లెట్లు ఎన్ని పతకాలు తెచ్చారన్నదే ముఖ్యం కాదు. వారి ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల తీసుకునే శ్రద్ధనే కీలకం. మహిళా అథ్లెట్ల ఆరోగ్యాన్ని కాపాడే వ్యవస్థను నిర్మించినప్పుడే క్రీడారంగం నిజమైన విజయం సాధించినట్టవుతుంది. 
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

సర్వేలు ఏం చెబుతున్నాయంటే...
⇒  ప్రపంచ వ్యాప్తంగా 2.1 బిలియన్ల మంది మహిళలు, కౌమార బాలికలు పీరియడ్స్‌లో ఉంటారని అంచనా. కానీ, 500 మంది మిలియన్‌ స్త్రీలకు పీరియడ్‌కు సంబంధించిన సరైన సదుపాయాలు లేవని సర్వేలు చేబుతున్నాయి. 
రుతుస్రావం అనేది ఒక సహజ శారీరక ప్రక్రియ, కానీ రుతుస్రావం అయ్యే వ్యక్తులు దానిని విభిన్నంగా అనుభవిస్తారు. ప్రతి ముగ్గురు స్త్రీలు, బాలికలలో ఇద్దరికంటే ఎక్కువ మందికి రుతుస్రావ సమయంలో నొప్పి ఉంటుంది. కొద్దిమందికి, రుతుస్రావ నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చు. 
రుతుస్రావం అయ్యే చాలా మంది స్త్రీలలో అధిక రక్తస్రావం సమస్య ఉంటుంది. దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.

మార్పులను గమనించి శిక్షణ
శరీర మార్పును మైండ్‌ అర్థం చేసుకొని స్పోర్ట్‌కి సన్నద్ధం కావాలి. మహిళ పీరియడ్స్‌ వివిధ దశల్లో హార్మోన్ల స్థాయులలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు కొందరిలో కండరాల పనితీరు, శక్తి, శరీర ఉష్ణోగ్రత, మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. పీరియడ్స్‌కు ఒక అథ్లెట్‌ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి, దానికి అనుగుణంగా శిక్షణ, విశ్రాంతి,పోషకాహారాన్ని ఇవ్వాలి. మన దేశంలో ఇప్పటికీ చాలామంది మహిళా అథ్లెట్లు కోచ్‌తో పీరియడ్స్‌ గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు. చాలా మందికి ఈ అంశంపై తగిన అవగాహన ఉండదు.

దీంతో నొప్పితో ఉన్నప్పటికీ, అదే తీవ్రతతో శిక్షణ కొనసాగిస్తుంటారు. ఇది మారాలి. ముందు తన శరీరాన్ని అర్థం చేసుకోవాలి. అవసరమైతే వ్యాయామ తీవ్రతను తగ్గించడం, రికవరీ సమయం పెంచడం,పోషకాహార నిపుణులతో సంప్రదించడం వంటి చర్యలు తీసుకోవాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పీరియడ్స్‌ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, మనస్తత్వం పైనా ఎలాంటి ప్రభావం చూపుతాయో అథ్టెట్ల్స్‌కు అవగాహన కల్పిస్తాం.     – కె. హిందోళ, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement