అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంప్రదాయ టెస్టు క్రికెట్లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఐసీసీ కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ చైర్మన్ జై షా సహా ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ సౌరవ్ గంగూలీ సహా తదితరులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో వినియోగిస్తున్న ఎర్రబంతికి బదులు ఇకపై పింక్ బంతిని వినియోగంలోకి తీసుకురావాలనే యోచనలో ఐసీసీ ఉంది. దీనితో పాటు టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయాలు, డ్రింక్స్ బ్రేక్ల సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐసీసీ టెస్టు ఫార్మాట్లో వేర్వేరు రంగుల బంతులను ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. అందువల్ల, సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతికి మారే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో, వాతావరణ అంతరాయాలు ఏర్పడినప్పుడు లైట్ల వెలుగులో ఆటను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరిస్తే, జట్లకు ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతిని ఉపయోగించడానికి అనుమతి లభించనుంది.
ప్రతిపాదిత మార్పుల వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఎరుపు బంతి నుండి గులాబీ బంతికి మారే ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్ను మైదానంలోకి అనుమతించడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే దీనిని వన్డే క్రికెట్లో తీసుకురావాలని ఐసీసీ యోచిస్తోంది.
మైదానంలోకి హెడ్కోచ్..
ఇప్పటివరకు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్ విరామంలో మైదానంలోకి అనుమతి ఉంది. భవిష్యత్తులో డ్రింక్స్ విరామాల్లో హెడ్కోచ్ను కూడా మైదానంలోకి అనుమతిస్తే, అతడు జట్టు జెర్సీ వేసుకొని రావాలా లేక సాధారణంగా రావాలా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఇక వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ విరామాలు ఉండేలా మార్పులు చేయనున్నారు. ఒక ఇన్నింగ్స్లో ప్రతీ డ్రింక్స్ బ్రేక్కు గంటా 10 నిమిషాల వ్యవధి ఉండనుంది.
ఇన్నింగ్స్ విరామంపై కీలక నిర్ణయం
ఇక టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయాన్ని తగ్గించాలని ఐసీసీ సమావేశంలో ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఉన్న 20 నిమిషాల సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రెండో ఇన్నింగ్స్ 15 నిమిషాల్లోనే ప్రారంభమయ్యేలా చూసుకోవాలని ఐసీసీ తెలిపింది. మే 30న అహ్మదాబాద్లో జరగనున్న మలి విడత సమావేశంలో ఐసీసీ బోర్డు దీనిపై స్పష్టతనివ్వనుంది.


