ఆమిర్- రోస్టన్ ఛేజ్ (PC: WC X)
సొంతగడ్డపై శ్రీలంకతో తొలి టెస్టులో వెస్టిండీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. నార్త్ సౌండ్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంకను తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకే ఆలౌట్ చేసింది.
లంకను కట్టడి చేసి..
లంక బ్యాటర్లలో దినేశ్ చండీమాల్ అర్ధ శతకం (54)తో ఆకట్టుకోగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ శతకం (120) సాధించాడు. మిగిలిన వారిలో కుశాల్ మెండిస్ 43 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్ మూడు, కేమార్ రోచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్ తలా రెండు వికెట్లు తీయగా.. జేడన్ సీల్స్కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (39), బ్రాండన్ కింగ్ (31) వికెట్లు కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన కేవమ్ హాడ్జ్ (16) కూడా నిరాశపరిచాడు.
ఆమిర్ డబుల్ సెంచరీ
వికెట్ కీపర్ బ్యాటర్ జాషువా డా సిల్వా (20) విఫలం కాగా.. జస్టిన్ గ్రీవ్స్ (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ ఆమిర్ జాంగూ, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ను గాడినపెట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆమిర్ 373 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 233 పరుగులు సాధించాడు.
రోస్టన్ జస్ట్ మిస్
ఇక రోస్టన్ ఛేజ్ 324 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 194 పరుగులు రాబట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అల్జారీ జోసెఫ్ 21, షమార్ జోసెఫ్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఫలితంగా 160.5 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 626 పరుగుల భారీ స్కోరు సాధించిన వెస్టిండీస్.. తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
401 పరుగుల పార్ట్నర్షిప్
ఇదిలా ఉంటే.. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా ఆమిర్ జాంగూ- రోస్టన్ ఛేజ్ ప్రపంచ రికార్డు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 401 పరుగుల పార్ట్నర్షిప్ సాధించి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు.
ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ జోడీ జానీ బెయిర్స్టో- బెన్ స్టోక్స్ పేరు మీద ఉండేది. సౌతాఫ్రికాతో 2016 నాటి టెస్టులో వీరు ఆరో వికెట్కు 399 పరుగులు జోడించారు. ఇప్పుడు బెయిర్స్టో-స్టోక్స్ను ఆమిర్- రోస్టన్ అధిగమించారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. విండీస్ కంటే 303 పరుగులు వెనుకబడి ఉంది.


