టీమిండియా చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని పొడిగించాలా? లేదా వద్దా? అన్న అంశంపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. అతడి భవితవ్యం తెల్చేందుకు శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అగర్కార్ కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించకపోతే అతడి స్ధానాన్ని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ భర్తీ చేసే అవకాశముందని 'ది టెలిగ్రాఫ్' తమ కథనంలో వెల్లడించింది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. తొలుత అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ను పరిగణనలోకి తీసుకున్నారని, అయితే ప్రయాణాల భారం కారణంగా చీఫ్ సెలక్టర్ పదవిని చేపట్టడానికి అతడు చూపలేదంట. దీంతో లక్ష్మణ్కు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' (Director of Cricket) అనే నూతన పదవిని కట్టబెట్టేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం.
వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది జూన్తో ముగియాల్సి ఉంది. కానీ భారత క్రికెట్ బోర్డు అతడికి మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడినే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు విషయంలో బీసీసీఐకి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిని తప్పించే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది.
చదవండి: IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!


