
ఘర్షణలకు టీడీపీ అభ్యర్థి ‘గద్దె’ ప్రణాళిక
ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీపై నెట్టాలని ప్లాన్
రోజు రోజుకూ అవినాష్కు పెరుగుతున్న ఆదరణ
ఆ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు
‘తూర్పు’ ప్రశాంతంగా ఉంటే.. అల్లర్లు అంటూ గద్దే, ఆయన సతీమణి ప్రచారం
గతంలో వారిద్దరూ ఎన్నికల సమయంలో ఇలాగే వ్యవహరించిన వైనం
మంచితనం ముసుగులో ప్రజలను మోసగించడమే ‘గద్దె’ నైజం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ ‘తూర్పు’ ఇన్చార్జి అవినాష్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ప్రత్యక్షమై సత్వరమే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను అవినాష్ పొందుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో అవినాష్ గెలుపు తథ్యమని ఇప్పటికే ‘తూర్పు’ ప్రజలంతా అంటున్నారు. ఈ తరుణంలో.. టీడీపీ అభ్యర్థి గద్దె, ఆ పార్టీ నేతలు రోజూ పార్కుల్లో, అపార్ట్మెంట్లలో మీటింగ్లు పెడుతూ, అవినాష్కు సంబంధం లేని గొడవల గురించి చెబుతూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి గిమ్మిక్కులు చేశారని గద్దె రామ్మోహన్ వంచనల గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎదుటి వారిని రెచ్చగొట్టడం వారి నైజం
ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను రెచ్చగొట్టడం, గొడవలు జరగకుండానే జరిగినట్లు, తమపై దాడి చేశారని యాగీ చేయడంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ సిద్ధహస్తులని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
● 1994 ఎన్నికల్లో గన్నవరంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సమయంలో సౌమ్యుడైన దాసరి బాలవర్థనరావు వర్గం ఎలాంటి దాడి చేయకుండానే, తమపై దాడి చేశారంటూ గద్దె నానాహంగామా సృష్టించారు. మమ్మల్ని తిరగనియ్యడం లేదంటూ నాడు గద్దె రామ్మోహన్ దొంగ ఏడుపులు ఏడ్చారు.
ఆయన సతీమణి కూడా నియోజకవర్గంలో సానుభూతి పొందేలా డ్రామా ఆడి రక్తికట్టించారు. నియోజకవర్గం అంతా పుకార్లు పుట్టించి లాభ పడినట్లు నాటి ఘటనను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
● 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దేవినేని నెహ్రూ ఎన్నికల ముందు రోజు తన సన్నిహితుని ఇంటికి పనిపై వెళ్లి వస్తే, మా ఇంటిపైకి వచ్చారంటూ గద్దె రామ్మోహన్ నానాయాగీ చేసి, చొక్కాలు చించుకొని, తమపై దాడి చేశారంటూ దొంగ నాటకానికి తెరలేపారు. ఉదయాన్నే పోలింగ్ ఉండటంతో ఈ ఘటనే సాకుగా చూపుతూ ఓట్లు దండుకొనే యత్నం చేశారు. ఆ అల్లరి కారణంగానే నాడు స్వల్ప తేడాతో నెహ్రూ ఓటమి పాలయ్యారు. ఇలా ప్రజలను గద్దె వంచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు అప్రమత్తం కావాలి
పోలీసులు అప్రమత్తమై ‘తూర్పు’లో గద్దె రామ్మోహన్ కుట్రలను భగ్నం చేసి , ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాదు మంచి మనిషి అనే ముసుగులో ఆయన చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేకం ఉన్నాయని, అవన్నీ బయట పెడితే, కృష్ణానదిలో తలలు ముంచుకు పోవాలని ఇటీవల దేవినేని అవినాష్ ఒక సభలో ఆరోపించిన విషయం తెలిసిందే.
నోరు జారిన ‘గద్దె’ తనయుడు
ఇటీవల నగరంలో ఒక వేడుక వద్ద యువత పార్టీ జరిగింది. ఆ పార్టీలో అమెరికా నుంచి వచ్చిన గద్దె తనయుడు పాల్గొన్నారు. ఆ సమయంలో పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు ఈసారి అవినాష్ గెలుపు ఖాయంగా ఉంది, ఎవరు చూసినా ఆయనే అంటున్నారని చర్చ జరిగింది. ఆ సమయంలో అదేమి లేదు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ‘తూర్పు’లో అల్లర్లు జరుగుతాయి, దాంతో ఆయన ఇమేజ్ దెబ్బతిని మళ్లీ మా నాన్న గెలుపు తథ్యమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా టీడీపీ వాళ్లే అల్లర్లు చేసి, ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీపై వేసే కుట్రలు తూర్పులో జరుగుతున్నాయనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.