
న్యూఢిల్లీ: న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించగా, కంగనా రనౌత్ సైతం అతని గెలుపును ఉద్దేశిస్తూ మండిపడ్డారు.
తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. @మమ్దానీ తల్లి మీరా నాయర్.. భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్లో ఉన్నప్పటికీ భారత్లో పుట్టి పెరిగారు.
గుజరాత్కు చెందిన మెహ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. మెహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు.
His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj
— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025
కాగా, 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలిచాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.
అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.
అయితే జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.