‘ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు! | AIIMS Delhi Crisis, Why Top Doctors Are Fleeing To Private Hospitals, Sparks Debate Over Institutional Challenges | Sakshi
Sakshi News home page

‘ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు!

Jun 24 2026 9:17 AM | Updated on Jun 24 2026 11:11 AM

AIIMS Delhi Crisis Why Top Doctors Are Fleeing to Private Hospitals

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఢిల్లీ ప్రస్తుతం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రోగులకు భరోసానిచ్చే ఈ వైద్యాలయం నుండి అగ్రశ్రేణి వైద్యులు, విభాగాధిపతులు ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు తమ పదవులను వదులుకుని ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఊహించని స్వచ్ఛంద విరమణలు
2023- 2025 సంవత్సరాల మధ్య కాలంలో ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన దాదాపు 15 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు తమ పదవుల నుండి స్వచ్ఛంద విరమణ (వీఆర్‌ఎస్‌)తీసుకున్నారు. వీరిలో కనీసం 13 మంది ప్రముఖ వైద్యులు తదనంతరం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చేరడం గమనార్హం. 1956లో భారతీయ విద్యార్థులకు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి పీజీ వైద్య విద్యను అందించే లక్ష్యంతో స్థాపించిన ఈ సంస్థ, ఇప్పుడు తన అమూల్యమైన వైద్య నిపుణులను కోల్పోతోంది.

27 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రముఖ డాక్టర్
ఈ వరుస నిష్క్రమణలలో అత్యంత సంచలనంగా మారిన పేరు డాక్టర్ శివ్ కుమార్ చౌదరి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ (సీటీవీఎస్‌) విభాగాధిపతిగా పనిచేసిన ఆయన, సర్వీస్ ఇంకా మిగిలి ఉండగానే 2024లో స్వచ్ఛంద విరమణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థతో 27 ఏళ్ల అనుబంధాన్ని ముగించుకున్న ఆయన, ప్రస్తుతం న్యూఢిల్లీ ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఈ నిర్ణయం వైద్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

నిష్క్రమణకు అసలు కారణం ఇదే!
తాము ఎయిమ్స్‌ను వీడటానికి గల ప్రధాన కారణాన్ని డాక్టర్ చౌదరి బహిర్గతం చేశారు. సంస్థలో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రమానుగత శ్రేణి లేదా అధికార క్రమం దెబ్బతినడమే దీనికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు. తమలాంటి పలువురు సీనియర్ వైద్యులు ఎయిమ్స్ లాంటి వ్యవస్థను వదిలి వెళ్లడానికి ఈ అంతర్గత మార్పులే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంతర్గత విభేదాలు సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement