'పెద్ది' సినిమా రన్ దాదాపు ముగిసింది. మరోవారంలో ఓటీటీలోకి వచ్చేయొచ్చు. ఈ మూవీతో రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. అందుకు తగ్గట్లే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించుకున్నారు. అలా అని సినిమా బ్లాక్బస్టర్ అయిందా అంటే లేదు. పోని ఫ్లాప్ అయిందా అంటే కాదు. మధ్యలోనే అలా ఉండిపోయింది. ఈ సంగతి కాసేపు పక్కనబెడితే 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ ఏంటి? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్)
'పెద్ది' సినిమా బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే వసూళ్లలో దాదాపు డబ్బులన్నీ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. కర్ణాటకలో పర్లేదనిపించగా.. తమిళనాడు, కేరళలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాదిలోనూ జస్ట్ ఓకే అనిపించుకుంది. విదేశాల్లో అయితే పెద్దగా వసూళ్లు రాలేదు. ఓవరాల్గా చూసుకుంటే రూ.400 కోట్ల వసూళ్లు వచ్చినప్పటికీ జాన్వీ కపూర్, పలు సన్నివేశాల కారణంగా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కానీ రామ్ చరణ్కి మాత్రం కెరీర్ పరంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.
'పెద్ది'.. ఎక్కువ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన రామ్ చరణ్ బాక్సాఫీస్ మార్కెట్పై మళ్లీ నమ్మకాన్ని పెంచింది. ఇకపోతే దర్శకుడు బుచ్చిబాబు తన తొలి మూవీ 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్కు ఒక కథ చెప్పినా అది వర్కౌట్ కాలేదు. అనంతరం రామ్ చరణ్ని ఒప్పించి 'పెద్ది' తీశాడు. ఇది వసూళ్లు సాధించినప్పటికీ, దర్శకుడిగా బుచ్చిబాబుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. పైపెచ్చు జాన్వీ సీన్ల కారణంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక బుచ్చిబాబుకి నెక్స్ట్ ఎవరు అవకాశమిస్తారు అనే విషయానికొస్తే.. మహేశ్ బాబు పేరు వినిపించింది గానీ అది అవుతుందా లేదా చెప్పలేం! మరోవైపు తెలుగులో స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ తదితరులు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వీళ్ల డేట్లు దొరకడం కష్టం. రామ్ చరణ్ మరో సినిమా చేస్తానని బుచ్చిబాబుకి మాటిచ్చారు కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరో రెండు మూడేళ్లయినా ఆగాలి. అప్పటివరకు ఆగుతాడా? లేదంటే యంగ్ హీరోలతో సింపుల్ బడ్జెట్ మూవీ చేస్తాడా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)


