యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గాయానికి నేడు శస్త్రచికిత్స జరగనుంది. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ సర్జరీ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది.
తాజాగా గాయానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించడంతో కిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ చేయనున్నట్లు వెల్లడించింది. సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


