తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఎమోషనల్ అయిన సూర్య | Suriya gets emotional Vishwanath and Sons Event | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఎమోషనల్ అయిన సూర్య

Aug 12 2026 12:03 AM | Updated on Aug 12 2026 1:23 AM

Suriya gets emotional Vishwanath and Sons Event

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు. శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’లో హ్యూమన్‌  ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు మొదట్నుంచి త్రివిక్రమ్‌గారి సపోర్ట్‌ ఉంది. ఈ సినిమా నాకు మంచి జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు.

‘గజినీ’లో సంజయ్ రామస్వామి పాత్రను ఎలా ఆదరించారో.. అదే వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపొందించారని సూర్య చెప్పారు. హైదరాబాద్‌లో ఆరు నెలల షూటింగ్ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. వెంకీ అట్లూరి రైటింగ్, సిన్సియారిటీని ప్రశంసిస్తూ.. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అందించిన ప్రేమనే ఆగస్టు 14న విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’కు కూడా అందించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు.

‘‘రాధికగారు ఈ సినిమాలో ఒక మ్యాజిక్‌. ఇక లైఫ్‌లో మీకు డబ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే... మమితలా ఇంత మంచి పొజిషన్‌లో ఉంటారు. జూనియర్‌ ఆర్టిస్టు కుమార్తె నుంచి ఇప్పుడు ఆమె ఈ వేదికపై ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి. వెంకీ ఈ సినిమాలో మూడు అందమైన మహిళా క్యారెక్టర్స్‌ రాశారు. వెంకీతో నేను ఓ బయోపిక్‌ చేయాల్సింది. కానీ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఈ చిత్రం మా అందరికీ స్పెషల్‌’’ అని సూర్య అన్నారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల ముఖంపై ఒక చిరునవ్వు ఉంటుంది. సూర్య నటించిన చాలా సినిమాలు ఫ్రై డే రోజునే నేను చూశాను. కానీ నేను ఆయన్ను డైరెక్ట్‌ చేసిన సినిమా ఈ ఫ్రై డే రిలీజ్‌ కానుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులను 90 శాతం ఎంటర్‌టైన్‌  చేస్తానని చెప్పగలను’’ అని అన్నారు. 

‘‘చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై ధైర్యంగా చెబుతున్నా... ఈ సినిమా చాలా బాగుంది. ఇందులో మదర్‌ అండ్‌ సన్స్  రిలేషన్‌  అద్భతంగా ఉంటుంది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నాగవంశీ. ‘‘కొత్త పాయింట్‌తో వెంకీ అట్లూరి మంచి కథ రాశారు. ఈ సినిమాలో మూడు పాటలు రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాతలు వై. రవిశంకర్, కేఎల్‌ నారాయణ, జూబ్లీహిల్స్‌ ఎమ్‌ఎల్‌ఏ నవీన్‌  యాదవ్‌ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ హిట్‌ కావాలని ఆకాంక్షించారు.  

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement