
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్కు చెందిన ఎస్ఎస్ స్టాన్లీ( 57) అనారోగ్య సమస్యలతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కోలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 15న వలసరవక్కంలోని విద్యుత్ శ్మశానవాటికలో జరగనున్నాయి.
కాగా.. స్టాన్లీ 'ఏప్రిల్ మాధతిల్', 'పుదుకోట్టైయిలిరుండు శరవణ్', 'మెర్క్యురీ పౌక్కల్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2000ల దశకంలో పలు కోలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 'ఏప్రిల్ మాధతిల్' (2002)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ధనుశ్ హీరోగా నటించిన 'పుదుకోట్టైయిలిరుందు శరవణన్' మూవీకి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. దర్శకత్వం వహించడంతో పాటు 'నినైతలే ఇనిక్కుమ్', 'నన్బన్' వంటి చిత్రాలలో సహాయ పాత్రలతో నటనలోకి అడుగుపెట్టారు. అతను చివరిగా విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' చిత్రంలో కనిపించారు.