స్టార్ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం బుధవారం చెన్నై వెళ్లిన సమంత.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని కూడా కలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)
'చెన్నై చేరుకోగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యమంత్రి విజయ్ని కలిసే అవకాశం రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈయన హీరోగా మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు, ఈయన వ్యక్తిత్వం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చూసిన తర్వాత విజయ్ మరింత పెద్ద బాధ్యతలు అందుకుంటారని అనిపించేది. కెరీర్ పరంగా పీక్లో ఉన్నప్పుడు నటన వదిలేసి మరిన్ని సవాళ్లు, బాధ్యతలున్న కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ధైర్యంతో కూడిన పని'

'సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, విజయ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరికీ తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. ఆ పిలుపునకు స్పందించే వారు చాలా అరుదు.విజయ్ ఇప్పటికే ఆయనను విశ్వసిస్తున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారనే నమ్మకం ఉంది. ఆయన విజయం కేవలం పదవి వల్ల కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టమైన ఉద్దేశ్యంతోనే సాధ్యమవుతుంది' అని సమంత రాసుకొచ్చింది.
యువతకు విజయ్ గెలుపు ఒక ప్రేరణగా నిలవాలని, జీవితంలో ప్రారంభంలో కలలు కన్న దానికంటే ఎంతో పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ బట్టి చూస్తే విజయ్తో కలిసి నటిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి లాంటి పెద్ద పొజిషన్కి వెళ్తారని ఊహించింది. ఇప్పుడు అది నిజమవడంతో ఆయన్ని కలిసి ఆనందం వ్యక్తం చేసింది. విజయ్-సమంత.. కత్తి, మెర్సల్, తెరి మూవీలో నటించారు.
(ఇదీ చదవండి: ముఖ్యమంత్రి విజయ్ ని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం)


