
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాలీవుడ్ను కుదిపేసింది. అతని మరణం తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను పోలీసులు సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమెతో తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరి జీవితం అనేక మలుపులు తిరిగింది.
తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన రియా చక్రవర్తి..సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు అనుభవించిన బాధను పంచుకుంది. సుశాంత్ మృతి తర్వాత మాపై ఆరోపణలు రావడంతో మా ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా తలకిందులైందని వెల్లడించింది. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయని తెలిపింది.
రియా మాట్లాడుతూ.. "సుశాంత్ మరణం తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయి. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అంతేకాకుండా నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటైల్ పొందాడు. కానీ అదే సమయంలో నాతో పాటు అతను అరెస్టు అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు మిస్సయ్యాడు. దీంతో అతని ఎంబీఏ కెరీర్ భవిష్యత్తును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్లో ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఎందుకంటే నా తమ్ముడిని నియమించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొద్దిరోజులు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాలేదు. ఆ తర్వాత ఛాప్టర్-2 డ్రిప్ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాలనే ఆలోచన తనకు, షోయిక్కు వచ్చిందని.. దాన్నే కెరీర్గా ఎంచుకున్నామని " అని తాము ఎదుర్కొన్న బాధలను వివరించింది.
అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.