తెలుగులో ఏ సినిమా అయినా ఫలానా రోజున రిలీజ్ అవుతుందంటే.. హీరో,హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా టీమ్ అంతా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కనిపిస్తారు. ఇంటర్వ్యూలు, కాలేజీ టూర్స్ అని తెగ హడావుడి చేస్తుంటారు. వీటికి అదనంగా పేపర్ యాడ్స్, సిటీ అంతా హోర్డింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి ప్రచారంలో భాగమవుతుంటాయి. అయితే వీటి వల్ల ఒక్క టికెట్ కొనరని ప్రముఖ నిర్మాత నాగవంశీ అంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)
'ఏడాదికి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతగా చెబుతున్నా. ప్రమోషన్స్ అంటూ మేం ఖర్చు చేసే ప్రతి రూపాయి వృథానే. డబ్బులు పెట్టి చేసే పబ్లిసిటీ వల్ల ఒక్క టికెట్ తెగదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఒక్క టికెట్ కొనరు. ఆర్గానిక్గా ఓ టీజర్ నచ్చి పాట నచ్చితే ప్రేక్షకులు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోతే.. ఏ ప్రమోషన్స్ చేయరా? సినిమాని వదిలేస్తారా? సినిమాకు బజ్ లేదని అంటారు. పోనీ ఇవేమైనా చేస్తే బజ్ వస్తుందా? టికెట్ తెగుతుందా? గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే తెలీదు. న్యూస్ పేపర్ యాడ్స్, హోర్టింగ్స్.. వీటివల్ల ఏమొస్తుంది? టికెట్ ఏం తెగదని ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోరు. వీరభద్రుడు, బ్లాస్ట్, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ.. ఈ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్కి సెకండ్ షో కలెక్షన్కి సంబంధం లేదు. ఉదయం షోకి రాత్రి షోకి మధ్య ఉన్న 10-12 గంటల గ్యాప్లో ఏం ప్రమోషన్ చేస్తారు? ఏం చేయంగా! సినిమా బాగుందటే టాక్ వల్లే ఇలా జరిగింది' అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
ఈయన చెప్పిన దానిబట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా టాక్ బాగోలేదు అని వస్తే జనాలు లైట్ తీసుకుంటారు. అదే టైంలో ఎలాంటి స్టార్స్ లేని, అసలు బజ్ లేని చిన్న చిత్రం బాగుందంటే ప్రేక్షకులే నెత్తిన పెట్టుకుంటారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి.
ఇకపోతే నాగవంశీ నిర్మించిన 'లెనిన్' సినిమా గత నెలలో రిలీజ్ కాగా ఇప్పుడు సూర్యతో చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' రాబోతుంది. వచ్చే శుక్రవారం ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. వచ్చే నెలలో ఈయన నిర్మించిన 'ఎపిక్' థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. అలానే ఆనంద్ దేవరకొండ చేసిన 'తక్షకుడు' అనే చిత్రం దీపావళి టైంలో నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా)


