బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు | Delhi Court Summons Issue Actor Dharmendra | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు

Dec 10 2024 11:43 AM | Updated on Dec 10 2024 11:51 AM

Delhi Court Summons Issue Actor Dharmendra

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర వల్ల మోసపోయానంటూ ఒక వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ కేసుకు సంబంధించి ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) యశ్‌దీప్ చాహల్ సమన్లు ​​జారీ చేశారు.

2018 ఏప్రిల్ నెలలో, ఉత్తరప్రదేశ్‌లోని NH-24/NH-9లో గరం ధరమ్ ధాబా  ఫ్రాంచైజీ ఇస్తామని ధర్మేంద్ర తనను సంప్రదించినట్లు సుశీల్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.  ఢిల్లీ, హర్యానా వటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్‌లు సుమారుగా  రూ. 70 నుంచి 80 లక్షల వరకు నెలవారీ టర్నోవర్‌ను ఆర్జిస్తున్నాయని ఆశ చూపించడంతో తాను కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. 

ఆ సమయంలో ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారన్నారు. ఈ ప్రక్రియ ముగుసిన తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి  స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి ‌ కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని ఆయన వాపోయారు.

‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో భాగంగా ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ అయ్యాయి.  420, 120B సెక్షన్ల కింద వారికి సమన్లు ​​పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు 2025 ఫిబ్రవరి 20 విచారణ జరగనుందని కోర్టు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement