మహబూబ్నగర్ న్యూటౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సురవరం వెంకటరామిరెడ్డి భవన్లో ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పాదయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరిస్తూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజలను సంఘటితం చేస్తామని, జిల్లా ప్రజలు, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రాము, కె.పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేష్, చాంద్ పాషా, కే రమేష్ నరసింహ, శ్రీలత , పూజిత, సంధ్య పాల్గొన్నారు.


