మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించి ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కేసులపై ఆరా తీశారు. పెండింగ్లో పెడుతున్న ఫిర్యాదులపై సకాలంలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులు పైరవీలు చేయడం లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఫిర్యాదులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు (పర్సన్ ఇన్చార్జి) గోనెల శ్రీనివాసులు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు ఆర్థిక బడ్జెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. చేప పిల్లలు, ఉపాధి కోసం, స్కిల్డవెలప్మెంట్, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నిధులు కేటాయించి జీవో కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి దోమ పరమేష్, బాలగోపి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ సీఈఓగా
షఫీ ఉల్లాఖాన్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మహమ్మద్ షఫీ ఉల్లాఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ ఖుష్బూగుప్తాను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో సహకార బ్యాంకుసేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు.


