దేవరకద్ర రూరల్: కోయిల్సాగర్ ప్రాజెక్ట్ డ్యాం గేట్ల దిగువ భాగంలో కాంక్రీట్ దెబ్బతిని భారీ గుంత ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. గోడ దిగువ భాగంలో కాంక్రీట్ ఊడిపోవడంతో లోపలి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్లో సుమారు 11 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం పెరిగిన తర్వాత గేట్ల ద్వారా నీటిని విడుదలచేసే సమయంలో గేట్ల దిగువ భాగాన నీటి ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పడిన గుంతకు వెంటనే మరమ్మతు చేయకపోతే.. అది మరింత విస్తరించి నిర్మాణానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాం భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. అవసరమైన మరమ్మతు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


