సాక్షి, బళ్లారి: బళ్లారిలోని ిహీరద సూగమ్మ పాఠశాలకు వందేళ్లు. రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒక్కటైన వీరశైవ విద్యావర్ధక సంఘం స్థాపించిన తొలి విద్యా సంస్థ ఇదే. హీరద సూగమ్మ పాఠశాల శబాబ్ది ఉత్సవాలు శుక్రవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు శోభాయాత్ర, డోలు, వీరగాసె నృత్యం, డప్పు చప్పుళ్ల మధ్య నిర్వహించిన ఊరేగింపులో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. వీరశైవ విద్యావర్ధక సంఘం పదాధికారులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠశాలకు ఘన చరిత్ర..
హానగల్ కుమార శివయోగులు, ఉజ్జయిని పీఠాధిపతి సిద్దలింగ శివాచార్య జగద్గురువుల మార్గదర్శకత్వంలో ప్రజల్లో ధార్మిక చైతన్యంతో పాటు, విద్యా, సామాజిక అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో 1916లో వీరశైవ విద్యావర్ధక సంఘం స్థాపించారు. తొలుత విశ్రాంతి నిలయం, అనంతరం ప్రసాద నిలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సాంస్కృతి పాఠశాలను ప్రారంభించారు. 1906 సంవత్సరంలో హీరద సూగమ్మ ధర్మార్థ కార్యక్రమాల కోసం బళ్లారిలోని గణేశగుడి వీధిలో ఒక చౌకిని ఏర్పాటు చేశారు. అనంతరం 1924 సంవత్సరం వీరశైవ విద్యావర్ధక సంఘం సాంస్కృతిక పాఠశాలను అక్కడికి మార్చి వీరశైవ స్కూల్ను ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం 1956లో హిరద సుగమ్మ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం అఖండ బళ్లారి జిల్లాలో వీరశైవ విద్యావర్ధక సంఘం ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు, కళాశాలలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉచితంగా విద్యను అందిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం, అన్నదానం చేస్తూ పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. ఈ పాఠశాలలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు.
అట్టహాసంగా
శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
రెండు రోజుల పాటు వేడుకలు


