డీల్‌పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట! | No Nukes, No Cash: Conflicting Trump and Iran Versions | Sakshi
Sakshi News home page

డీల్‌పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!

Jun 16 2026 8:05 AM | Updated on Jun 16 2026 8:08 AM

No Nukes, No Cash: Conflicting Trump and Iran Versions

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్‌లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. 

అయితే ఇరాన్‌ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్‌ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్‌)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్‌ హాజరుపై స్పష్టత లేదు.

ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.

అలాగే ఇరాన్‌పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్‌వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.

లేటెస్ట్‌ అప్‌డేట్స్:

* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.
* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.
* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. 
* ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. 
* అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 

ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement