శాన్ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్లో మానవాళికి తీవ్ర ముప్పుగా మారొచ్చంటూ కొందరు నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఏఐ వ్యవస్థలు త్వరలోనే మానవులకంటే శక్తిమంతంగా మారి నియంత్రణ తప్పితే మానవాళి ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిలికాన్ వ్యాలీలోని పలువురు టెక్ వర్గాలు మాత్రం ఈ హెచ్చరికలను అతిశయోక్తిగా కొట్టిపారేస్తున్నాయి.
ప్రతి సెప్టెంబర్లో శాన్ఫ్రాన్సిస్కోలో గోల్డ్మన్ సాక్స్ నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు హాజరవుతుంటారు. ఈసారి కూడా కంపెనీల వృద్ధి, పెట్టుబడులతో పాటు ఏఐ భద్రత, దాని భవిష్యత్ ప్రభావాలపై చర్చ జరిగింది.
‘మానవాళిని నాశనం చేయొచ్చు’
ఇటీవల ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.. ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు మానవాళి భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల కాక్సన్ గతంలో ఓపెన్ఏఐలో పనిచేశారు. ఏఐ త్వరలోనే మానవులకంటే ఎక్కువ సామర్థ్యాన్ని సాధించి, సైబర్ వ్యవస్థలను కూడా హ్యాక్ చేయగల స్థాయికి చేరుకోవచ్చని హెచ్చరించారు.
ఆంత్రోపిక్ టీమ్ లీడ్ ఇవాన్ హ్యూబింగర్ కూడా వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి నశించే అవకాశం 10 శాతానికంటే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు కూడా ఏఐ భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేశారు.
హెచ్చరికలా.. ప్రచార వ్యూహమా?
అయితే ఈ హెచ్చరికలపై సిలికాన్ వ్యాలీలో అందరూ ఏకీభవించడం లేదు. ఏఐ ప్రమాదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో భయంతో పాటు ఆ సంస్థల ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతుందని కొందరు పెట్టుబడిదారులు, టెక్ వర్గాలు అంటున్నాయి.
ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సంస్థలు భారీ విలువలతో స్టాక్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏఐ సామర్థ్యాలను అత్యంత శక్తిమంతమైనవిగా చూపించేందుకు ఇలాంటి హెచ్చరికలు ఉపయోగపడుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ గతంలో ఏఐ కారణంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో సగం వరకు కనుమరుగయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
‘భయపెట్టి పెట్టుబడులు పెంచుతున్నారా?’
ఆంత్రోపిక్ నిధుల సమీకరణలో సుమారు 965 బిలియన్ డాలర్ల విలువను సాధించిన నేపథ్యంలో.. సంస్థలు తమ ఏఐ సామర్థ్యాలను చూపించేందుకు మానవాళికి ముప్పు వంటి అంశాలను ప్రచారంలో ఉపయోగిస్తున్నాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఆల్టిమీటర్ క్యాపిటల్ అధిపతి బ్రాడ్ గెర్స్ట్నర్ కాక్సన్ వ్యాఖ్యలను అతిశయోక్తిగా అభివర్ణించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్ కూడా తొలుత ఈ హెచ్చరికలను ప్రశ్నించారు. అయితే ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా నియంత్రణలు తీసుకురావాలని అమోడీ సూచించడంతో ఆయన వైఖరి కొంత మారింది.
ఏఐపై ఆందోళనలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఆంత్రోపిక్ రూపొందించిన ‘మైథోస్’ వ్యవస్థ కొన్ని హ్యాకింగ్, సైబర్ భద్రతా పనుల్లో మనుషుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. తనను ఉంచిన పరిమిత కంప్యూటర్ వాతావరణం నుంచి స్వయంగా బయటపడే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించినట్లు తెలిపింది.
తమ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బయో ఆయుధాల తయారీ, సైబర్ గూఢచర్యానికి ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి అడ్డుకున్నామని ఆంత్రోపిక్ పేర్కొంది. దీంతో ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన నియంత్రణలు అవసరమన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
అమెరికాలో నియంత్రణలు వస్తాయా?
అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ సహా పలువురు నేతలు అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నారు. ఏఐపై మానవులు నియంత్రణ కోల్పోతే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని సాండర్స్ హెచ్చరించారు.
అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఏఐ అభివృద్ధిపై కఠిన ఆంక్షలకు అనుకూలంగా కనిపించడం లేదు. చైనాను మించేందుకు అమెరికా ఏఐ రంగంలో వేగంగా ముందుకు సాగాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంత్రోపిక్తో ట్రంప్ ప్రభుత్వానికి విభేదాలు
ఆంత్రోపిక్, ట్రంప్ ప్రభుత్వాల మధ్య ఇటీవల విభేదాలు చోటుచేసుకున్నాయి. అమెరికా సైన్యం తమ ఏఐ మోడళ్లను ఉపయోగించేందుకు విధించిన కొన్ని షరతులను ఆంత్రోపిక్ అంగీకరించకపోవడంతో వైట్హౌస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఈ నిర్ణయంపై ఫెడరల్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరోవైపు ఓపెన్ఏఐ మాత్రం ట్రంప్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెబుతోంది. సంస్థ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్ కూడా ప్రభుత్వంతో మంచి భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ఓపెన్ఏఐ స్టాక్ మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, సంస్థ తాజా విలువ సుమారు 852 బిలియన్ డాలర్లుగా ఉంది.
పెట్టుబడిదారుల దృష్టి మాత్రం లాభాలపైనే..
ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడొచ్చన్న హెచ్చరికలు, నియంత్రణలపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల దృష్టి మాత్రం వ్యాపారంపైనే ఉంది.
ఆంత్రోపిక్ స్టాక్ మార్కెట్లోకి రావడానికి ముందు సమర్పించబోయే ఎస్-1 పత్రం కోసం ఓ పెట్టుబడిదారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వివరాలు ఉంటాయి. అయితే ఆయన ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఆంత్రోపిక్ లాభాల్లో ఉందా?
ఏఐ వల్ల ప్రపంచం అంతమయ్యే ప్రమాదం ఉందా? అని డీ-మ్యాట్రిక్స్ సీఈఓ సిడ్ షెత్ను అడిగితే.. ఆయన మాత్రం ‘లేదు’ అని సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?


