న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ను భారత్కు అప్పగించే అంశం న్యూఢిల్లీలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. భారత్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జకీర్ నాయక్ అప్పగింత అంశంపై చర్చలు జరిగాయని అన్వర్ ఇబ్రహీం జాతీయ మీడియాకు వెల్లడించారు.
ఈ అంశంపై చర్చలను ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గోప్యంగా ఉంచామని ఆయన చెప్పారు. భారత్, మలేషియా మధ్య విశ్వాసం, సంబంధాలను బలోపేతం చేసే అంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అప్పగింతకు సంబంధించిన డిమాండ్పై కొంత అవగాహన ఉందని, అయితే చట్టబద్ధమైన విధానాన్ని గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్వర్ ఇబ్రహీం చెప్పారు.
జాకీర్ నాయక్ 2016లో భారత్లో ఆయనపై, ఆయనకు సంబంధించిన సంస్థలపై దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మలేషియాకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన మలేషియాలో శాశ్వత నివాస హోదాతో ఉంటున్నారు. భారత్లో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. భారత్ ఆయనను అప్పగించాలని అధికారికంగా కోరింది. అయితే విశ్వసనీయమైన ఆధారాలు సమర్పిస్తే చట్టబద్ధమైన మార్గాల్లో సహకరిస్తామని మలేషియా చెబుతోంది.


