భారతదేశంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. పలు కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సర్వీస్నౌ విడుదల చేసిన ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం.. దేశీయ సంస్థల్లో AIపై పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయని తెలుస్తోంది.
2027 నాటికి 21.3 శాతం!
ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లో సగటున 16.6 శాతం ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. 2027 నాటికి ఇది 21.3 శాతానికి చేరుతుందని అంచనా. దీనివల్ల భారతదేశం ఏఐ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.
ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. దానిని సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన గవర్నెన్స్ మాత్రం ఆ స్థాయిలో లేదు. భారతదేశంలోని కేవలం 22 శాతం సంస్థలకే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్ వంటి విధానాలు ఉన్నాయి. 54 శాతం సంస్థలు ఏఐ ఏజెంట్ను ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 11 శాతం మాత్రమే అటానమస్ వర్క్ఫ్లోను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ వల్ల వచ్చే సమస్యలపై సంస్థలకు ఉన్న ఆందోళనలు. కాబట్టి ఏఐను వేగంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడం కూడా చాలా అవసరం.
ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే..
ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే మంచి డేటా, సిస్టమ్స్ అవసరం. అయితే.. భారతీయ సంస్థల్లో ఇది ఇంకా ఒక పెద్ద సవాలుగానే ఉంది. 74 శాతం కంపెనీలు.. డేటా అక్యురసీ, యాక్సెస్, మేనేజ్మెంట్ వంటి వాటిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
కాగా మరో 56 శాతం సంస్థలు లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ప్రధాన సమస్యగా గుర్తించాయి. కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే విడివిడిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్కు భర్తీ చేశాయి. వివిధ విభాగాల డేటా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోతే ఏఐకు పూర్తి సమాచారం అందదు. అందువల్ల ఏఐ అభివృద్ధితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బలోపేతం చేయాలి.
ప్రభుత్వం చర్యలు
ఏఐ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్, డీపీడీపీ రూల్స్, ఏఐ గవర్నెన్స్ గైడ్లైన్స్, ఇండియాఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వంటి కార్యక్రమాలు ఏఐ ఇన్నోవేషన్తో పాటు ప్రైవసీ, సేఫ్టీ, అకౌంటబిలిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోంది.
ఇదే విధంగా సంస్థలు కూడా తమ ఇంటర్నల్ గవర్నెన్స్ సిస్టంను బలపరచాలి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లకు ఎంతవరకు డేటా, సిస్టమ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ హ్యూమన్ సూపర్ విజన్ అవసరం అనే విషయాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఏఐపై ప్రజలకు, సంస్థలకు నమ్మకం ఏర్పడాలంటే ఈ గవర్నెన్స్ చాలా కీలకం. మొత్తం మీద.. భారతదేశం ఏఐలో పెట్టుబడులు పెట్టడంలో వేగంగా ముందుకు సాగుతోంది, కానీ గవర్నెన్స్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!


