తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల కలిగే మానసిక ఆవేదన వర్ణనాతీతం. ఆ దుఖం నుంచి కోలుకోవడానికే తీవ్ర పోరాటం చేయాల్సి వస్తుంది. అయితే, అదే సమయంలో వారి బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, రుణాలు వంటి ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉంటుంది. ఈ సమయంలో చాలామంది ఆ పనులన్నీ ఒకేసారి పూర్తి చేయాలని భావించి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం.. తల్లిదండ్రులు కన్నుమూసిన వెంటనే కొన్ని పనులు మాత్రమే అత్యవసరం. మిగిలిన ప్రధాన నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం.
వెంటనే పూర్తి చేయాల్సినవి..
స్థానిక మునిసిపల్ ఆఫీస్ లేదా పంచాయతీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. ఇది డెత్ క్లెయిమ్లు, బ్యాంక్ ఖాతాల మార్పులకు తప్పనిసరి. తల్లిదండ్రుల క్రెడిట్ కార్డులు దుర్వినియోగం కాకుండా వెంటనే నిలిపివేయాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సమాచారం ఇచ్చి, అవసరమైన పత్రాలను సమర్పించి ప్రాసెస్ ప్రారంభించాలి. తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల నుంచి ఆటో-డెబిట్ అయ్యే అవసరం లేని సర్వీసులను లేదా సబ్స్క్రిప్షన్లను రద్దు చేయాలి.
కొంత సమయం వేచి చూడాల్సిన అంశాలు
స్థిరాస్తులు అమ్మడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లను వెంటనే విక్రయించడం వంటి పెద్ద నిర్ణయాలు కనీసం 3 నుంచి 6 నెలల వరకు తీసుకోకూడదు. బాధలో తీసుకునే నిర్ణయాలతో తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. వ్యక్తిగత రుణాలు తల్లిదండ్రుల ఎస్టేట్/ఇన్సూరెన్స్ నుంచి సర్దుబాటు అవుతాయి. పిల్లలు తమ వ్యక్తిగత డబ్బును వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్థిక బాధ్యతలను ఒకేసారి కాకుండా వర్గీకరించుకుని చట్టబద్ధంగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడమే కుటుంబానికి భద్రత, ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది.
ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ


