బోణీ కొట్టిన ‘గణేష్‌’ ఎకానమీ | Ganesh Chaturthi Economy 2026 How Festival Boom Driving India Retail Market | Sakshi
Sakshi News home page

బోణీ కొట్టిన ‘గణేష్‌’ ఎకానమీ

Sep 12 2026 11:07 AM | Updated on Sep 12 2026 11:40 AM

Ganesh Chaturthi Economy 2026 How Festival Boom Driving India Retail Market

వినాయక చవితి వేడుకలు దేశీయ వర్తక శ్రేణులకు సరికొత్త కళను తీసుకొచ్చాయి. కొవిడ్‌ తర్వాతి కాలంలో ప్రశాంతంగా, అట్టహాసంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్తక రంగాలకే కాక దేశవ్యాప్త రిటైల్‌ మార్కెట్‌కు ఊపునిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో సుమారు రూ.10,000 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినాయక విగ్రహాల తయారీ నుంచి డెకరేషన్, పూజా సామగ్రి, స్వీట్లు, లైటింగ్‌.. వరకు ప్రతి విభాగానికి ఈ పండుగ కొత్త ఊపిరి పోస్తోంది.

విగ్రహాల తయారీ, మండపాల ఏర్పాటు

గణేష్‌ ఉత్సవాల్లో ప్రధానాకర్షణ విగ్రహాలు, మండపాలే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరగడంతో మట్టి గణపతులకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేల సంఖ్యలో వెలసిన భారీ మండపాల నిర్మాణం కోసం స్థానిక కాంట్రాక్టర్లు, పందిరి నిర్మాతలు, డెకరేషన్‌ సిబ్బందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో భారీ మండపం ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. విగ్రహాల విక్రయాలు, రవాణా, మండపాల డెకరేషన్‌ ఖర్చులతో కలిపి కేవలం ఈ విభాగంలోనే వేల కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయి.

లైటింగ్, మైక్ సిస్టమ్స్

ఉత్సవాల వేళ మండపాల్లోని రంగురంగుల లైటింగ్, ఆకట్టుకునే థీమ్ డెకరేషన్లు మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఎల్‌ఈడీ లైట్లు, లేజర్ షోలు, సౌండ్ సిస్టమ్‌ల అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఈసారి డిజిటల్ డెకరేషన్లు, ఫ్లవర్ ఆర్ట్ కాన్సెప్ట్‌లకు నిర్వాహకులు ప్రాధాన్యమిస్తున్నారు. ఎలక్ట్రికల్ వ్యాపారులు, లైటింగ్ కాంట్రాక్టర్లు, ఈవెంట్ మేనేజర్లు ఈ పండుగ సీజన్‌లో దాదాపు 30-40 శాతం అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.

పూలు, పండ్లు, పూజా సామగ్రి

పండుగ రోజుల్లో పూలు, పండ్ల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. వినాయకుడికి ఇష్టమైన తులసి, గరిక, పత్రి, మందార, చామంతి పూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గట్లుగానే పూలు, పండ్ల ధరలు సాధారణ రోజుల కంటే పెరిగాయి. ఇక పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, ధూపం, కర్పూరం, వెండి ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్నాయి. చిరు వ్యాపారుల నుంచి పెద్ద షాపుల వరకు పూజా విభాగానికి సంబంధించిన బిజినెస్ రూ.1,500 కోట్లకు పైగానే నడుస్తోందని అంచనా.

లడ్డూలు, స్వీట్లు

వినాయకుడి నైవేద్యం అంటేనే లడ్డూలు, మోదకాలు, కుడుములు. ఈ ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా స్వీట్‌ షాపులు కిటకిటలాడుతున్నాయి. సాంప్రదాయ మోదకాలతో పాటు డ్రై ఫ్రూట్ స్వీట్లు, ఆర్గానిక్ బెల్లంతో చేసిన మిఠాయిలకు గిరాకీ పెరిగింది. ప్రసాదాల తయారీ కోసం పాల ఉత్పత్తులు, నెయ్యి, పిండి పదార్థాల వినియోగం పుంజుకుంది. ప్రముఖ స్వీట్ బ్రాండ్లు వినాయక చవితి ప్రత్యేక ఆఫర్లు, గిఫ్ట్ ప్యాక్‌లతో భారీగా లబ్ధి పొందేలా ప్లాన్‌ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: 2030 నాటికి 20 లక్షల కొలువులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement