ఫిన్టెక్ కంపెనీ పైసాబజార్, ఫెడరల్ బ్యాంకు కలసి వినియోగదారుల కోసం ‘ఫెడరల్ బ్యాంక్ పైసాబజార్ పైసాబ్యాక్ క్రెడిట్ కార్డ్’ను ఆవిష్కరించాయి. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్, పీబీ ఫిన్టెక్ గ్రూప్ సీఈఓ సర్బ్వీర్ సింగ్, ప్రెసిడెంట్ రాజీవ్ గుప్తా, ఎన్పీసీఐ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్డ్ను అధికారికంగా విడుదల చేశారు.
ఈ రాబోయే పండుగల సీజన్లో గృహ అవసరాల వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ కో-బ్రాండెడ్ కార్డ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల కొనుగోళ్లపై ఏకంగా 7.5% క్యాష్బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కార్డు ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్డు ప్రయోజనాలను వివరించారు.
డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్, స్టార్ బజార్, నేచర్స్ బాస్కెట్ వంటి సూపర్మార్కెట్లతో పాటు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లైన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్లలో జరిపే కొనుగోళ్లపై 7.5% క్యాష్బ్యాక్ లభిస్తుంది. రూపే నెట్వర్క్పై పనిచేసే ఈ కార్డ్ ద్వారా రూ.2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.5%, ఇతర ఈ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్ కొనుగోళ్లపై 1% క్యాష్బ్యాక్ పొందవచ్చు. ప్రతినెల గరిష్టంగా రూ.1,000 విలువైన క్యాష్ పాయింట్స్ పొందే వెసులుబాటు ఉంది. జాయినింగ్/వార్షిక రుసుము రూ.500 కాగా, సంవత్సరానికి రూ.1.5 లక్షలు వెచ్చిస్తే ఈ రుసుము మినహాయింపు లభిస్తుంది.
ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ


