కార్యకలాపాలను విస్తరించే కొద్దీ దేశీయంగా చాలా మటుకు కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిక్రూట్మెంట్కి సంబంధించి మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో హైరింగ్ అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ మ్యాన్పవర్ గ్రూప్ విడుదల చేసిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది క్యూ4లో నికరంగా వచ్చే ఉద్యోగాల ఔట్లుక్ (ఎన్ఈవో) 54%గా నమోదైంది. ఇది అంతర్జాతీయ సగటుకన్నా 25% అధికం కావడం గమనార్హం.
దేశీ గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్న పక్షంలో క్రితం క్వార్టర్తో పోలిస్తే 6%, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11% అధికం. రిపోర్ట్ ప్రకారం.. భారత్లో కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఉద్యోగావకాశాల అంచనాలు పెరిగాయి. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన సర్వేలో 3,055 సంస్థలు పాల్గొన్నాయి. కొత్తగా ఎన్ని సంస్థలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి, ఎన్ని సంస్థలు తగ్గించుకోవాలనుకుంటున్నాయన్న అంశాల ప్రాతిపదికన ఈ డేటాను మాన్పవర్గ్రూప్ సమగ్రపరుస్తుంది.
‘ఏఐకి తగ్గట్లుగా సిబ్బందిని మార్చుకోవడం, నైపుణ్యాల కొరత, ఉద్యోగార్థులు సదరు ఉద్యోగ ప్రమాణాలను అందుకోలేకపోతుండటంలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం నియామకాలపై ధీమాగానే ఉన్నాయి’ అని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా, మిడిల్ఈస్ట్ ఎండీ సందీప్ గులాటీ తెలిపారు.
సర్వేలో ఇతర ప్రధానాంశాలు..
అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని 65 శాతం సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. 11 శాతం సంస్థలు తగ్గించుకోవాలనుకుంటున్నాయి. తమ ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని 24 శాతం సంస్థలు తెలిపాయి.
ఉద్యోగ విధులు, నైపుణ్యాలపరమైన అవసరాలు మారుతున్న కొద్దీ దానికి తగ్గట్లుగా నియామకాలు చేపడుతున్నట్లు దాదాపు 70 శాతం సంస్థలు తెలిపాయి.
ఫైనాన్స్..బీమా.. ఆతిథ్యం తదితర రంగాల పటిష్ట వృద్ధి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ మొదలైన అంశాల వల్ల నిపుణులకు బాగా డిమాండ్ ఉంటోంది.
గత క్వార్టర్తో పోలిస్తే దేశీయంగా నాలుగు ప్రాంతాల్లోనూ నియామకాలపై సానుకూలత నెలకొంది. తూర్పు భారతంలో ఎన్ఈవో అత్యధికంగా 59 శాతంగా నమోదైంది.
గ్లోబల్గా నియామకాలపై ఆశావహంగా ఉన్న దేశాల్లో భారత్ (54 శాతం) టాప్లో ఉండగా, బ్రెజిల్ (53 శాతం), పనామా (49 శాతం), మెక్సికో (41 శాతం), యూఏఈ (41 శాతం), పెరూ (40 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతోంది. దీనితో హైరింగ్కి పట్టే సమయం గణనీయంగా తగ్గుతోంది.
ప్రస్తుతం నైపుణ్యాలు ఉన్న వారు దొరకడం పెద్ద సవాలుగా మారుతోంది. ఉద్యోగానికి అవసరమయ్యే అర్హతలు మారిపోతున్న కొద్దీ, సరైన సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులను తీసుకోవడం కష్టసాధ్యంగా ఉంటోంది.
ఇదీ చదవండి: 2030 నాటికి 20 లక్షల కొలువులు..!


