బంగారం, వెండి ధరలు ఈ వారం కూడా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, ముడిచమురు ధరల కదలికలు, ఇరాన్-మధ్యప్రాచ్య పరిణామాలు బులియన్ మార్కెట్కు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 11న వెలువడనున్న అమెరికా ఆగస్టు వినియోగదారుల ధరల సూచీ (CPI)గణాంకాలపై ప్రపంచ మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది.
అమెరికా ధరల సూచీపైనే ప్రధాన దృష్టి
ఆగస్టు వినియోగదారుల ధరల సూచీ (CPI)ని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ 11న విడుదల చేయనుంది. జూలైలో అమెరికా ధరల సూచీ వార్షిక ప్రాతిపదికన 3.4 శాతం పెరగగా, ఆహారం, ఇంధన ధరలను మినహాయించిన కోర్ సూచీ 2.5 శాతంగా నమోదైంది. రానున్న సీపీఐ గణాంకాలు సెప్టెంబర్ 15-16న జరిగే ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశంగా మారనున్నాయి.
ఇటీవల ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ద్రవ్యోల్బణం మరింత తగ్గితే సెప్టెంబర్లో వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో రేటు పెంపు అంచనాలు కొంత తగ్గి బంగారం, వెండికి స్వల్పంగా మద్దతు లభించింది. అయితే ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంటే రేట్ల పెంపు అవకాశాలు మళ్లీ పెరగవచ్చు.
ముడిచమురు.. ఇరాన్ ఉద్రిక్తతలు కూడా కీలకమే
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముడిచమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత పెరగవచ్చన్న ఆందోళన ఉంది. అదే జరిగితే ఫెడ్ మరింత కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశం ఉండటంతో బంగారం ధరలపై ఒత్తిడి రావచ్చు. మరోవైపు భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగితే సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరగడం ధరలకు మద్దతు ఇవ్వవచ్చు. అందుకే ప్రస్తుతం ఇరాన్ పరిణామాలు బంగారానికి నేరుగా ‘సేఫ్ హెవెన్’ డిమాండ్ కంటే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ద్వారా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశీయ మార్కెట్లో కీలక స్థాయిలు
గత వారం ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా ఊగిసలాడాయి. సెప్టెంబర్ 5న అక్టోబర్ డెలివరీ ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు రూ.1,52,815 వద్ద ముగిశాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ కామెక్స్ బంగారం వారాంతానికి సుమారు 1.2 శాతం తగ్గి ఔన్సుకు 4,476.6 డాలర్ల వద్ద నిలిచింది. న్యూయార్క్లో వెండి ఔన్సుకు 66.75 డాలర్లకు పడిపోయింది.
స్వల్పకాలంలో ఎంసీఎక్స్ బంగారానికి రూ.1.52 లక్షల ప్రాంతం కీలక మద్దతుగా, రూ.1.57 లక్షల ప్రాంతం కీలక నిరోధంగా మారే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. వెండిలోనూ రూ.2.31 లక్షల స్థాయి దిగువకు వెళ్లకుండా ఉంటే సానుకూల ధోరణి కొనసాగే అవకాశముంది.
చైనా కొనుగోళ్లు బంగారానికి దీర్ఘకాలిక బలం
ఇక దీర్ఘకాలంలో బంగారానికి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కీలక మద్దతుగా కొనసాగుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, చైనా పీపుల్స్ బ్యాంక్ జూలైలో మరో 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో వరుసగా 21 నెలల పాటు బంగారం నిల్వలను పెంచుకుంటూ వచ్చిన చైనా మొత్తం అధికారిక బంగారం నిల్వలు సుమారు 2,366 టన్నులకు చేరాయి. 2026లో ఇప్పటివరకు చైనా కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లు 60 టన్నులకు చేరుకున్నాయి.
వెండికి మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. విలువైన లోహంతో పాటు పారిశ్రామిక లోహంగా కూడా ఉపయోగించే వెండి.. ప్రపంచ ఆర్థిక వృద్ధి, పరిశ్రమల డిమాండ్, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులకు మరింత వేగంగా స్పందించే అవకాశం ఉంది. అందువల్ల బంగారంతో పోలిస్తే వెండిలో ధరల ఊగిసలాట మరింత తీవ్రంగా ఉండొచ్చు.


