‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై భారీ ప్రభావం చూపిన రచయిత రాబర్ట్ కియోసాకి పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కారణం.. ఆయన వెల్లడించిన 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లకు పైగా) అప్పు. అయితే ఈ మొత్తం కియోసాకి వ్యక్తిగతంగా చెల్లించాల్సిన రుణం కాదని, ఆయన భాగస్వాములతో కలిసి నిర్వహిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించినదని తాజా వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
కియోసాకి ఇటీవల ‘గెట్ రిచ్ ఎడ్యుకేషన్’ పోడ్కాస్ట్లో తాను సుమారు 1.2 బిలియన్ డాలర్ల అప్పులో ఉన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆర్థిక విద్యపై పుస్తకాలు రాసిన వ్యక్తికే ఇంత భారీ అప్పు ఎలా సాధ్యమంటూ చర్చ మొదలైంది. అయితే ఆ మొత్తాన్ని ఆయన వ్యక్తిగత రుణంగా చూడటం తప్పుదారి పట్టించే విషయమని ఆయన మాజీ భార్య, దీర్ఘకాల వ్యాపార భాగస్వామి కిమ్ కియోసాకి వివరించారు.
1,500 అపార్ట్మెంట్లకు సంబంధించిన రుణం
వానిటీ ఫెయిర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ కియోసాకి తెలిపిన వివరాల ప్రకారం.. కియోసాకి, ఆయన భాగస్వాములు సుమారు 1,500 అపార్ట్మెంట్ యూనిట్లను కలిగి ఉన్నారు. ఈ ఆస్తులకు సంబంధించిన రుణాల మొత్తం దాదాపు 1.2 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం అప్పు రియల్ ఎస్టేట్ ఆస్తులపై తీసుకున్న రుణం. అందులో కియోసాకి వ్యక్తిగత బాధ్యత చాలా తక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వానిటీ ఫెయిర్ అంచనా ప్రకారం ఆయన వ్యక్తిగత వాటా సుమారు 30 మిలియన్ నుంచి 60 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని తెలిపింది.
కియోసాకి ఈ విధానాన్ని తన ‘గుడ్ డెట్’ సిద్ధాంతానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధారణంగా అప్పును ఆర్థిక భారంగా భావిస్తే, కియోసాకి మాత్రం ఆదాయం తీసుకొచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే రుణాన్ని భిన్నంగా చూస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విలువ పెరిగినప్పుడు ఆ ఆస్తులపై మరింత రుణం తీసుకుని, వచ్చిన నిధులను ఇతర పెట్టుబడుల్లోకి మళ్లించడం ఆయన వ్యూహంలో కీలక భాగం.
ఆస్తి విలువ పెరిగితే.. మళ్లీ అప్పు
ఉదాహరణకు ఒక రియల్ ఎస్టేట్ ఆస్తి విలువ పెరిగిందనుకుందాం. దాన్ని విక్రయించి లాభం పొందడం బదులు, పెరిగిన ఈక్విటీని ఆధారంగా చేసుకుని రుణం తీసుకోవచ్చు. ఆ డబ్బుతో మరో ఆదాయాన్ని సృష్టించే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఇలా ఒక ఆస్తి నుంచి వచ్చే విలువను మరో పెట్టుబడికి ఉపయోగిస్తూ పోర్ట్ఫోలియోను విస్తరించడం కియోసాకి మోడల్లో కనిపిస్తుంది. పెట్టుబడులను వేర్వేరు లిమిటెడ్ లయబిలిటీ కంపెనీల (LLC) ద్వారా నిర్మించడం ద్వారా ఒక్క ఆస్తిలో సమస్య ఏర్పడితే అది మిగిలిన పెట్టుబడులపై ప్రభావం చూపకుండా రిస్క్ను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తారు.
‘నా వ్యూహాన్ని అనుసరించొద్దు’
అయితే ఇక్కడే అసలు రిస్క్ కూడా ఉంది. ఆస్తుల ధరలు పెరుగుతున్న సమయంలో అధిక పరపతి (leverage) భారీ సంపదను సృష్టించగలిగినా.. మార్కెట్ పడిపోతే నష్టాలను కూడా అదే స్థాయిలో పెంచుతుంది. ఆస్తి విలువ తగ్గితే రుణం-ఆస్తి నిష్పత్తి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వడ్డీ రేట్లు పెరిగితే రీఫైనాన్సింగ్ ఖర్చులు కూడా భారమవుతాయి.
ఈ కారణంగానే కియోసాకి స్వయంగా తన వ్యూహాన్ని అందరూ అనుసరించవద్దని హెచ్చరిస్తున్నారు. రుణాన్ని ఉపయోగించడం గురించి తాను 1974 నుంచే అధ్యయనం చేస్తున్నానని, అప్పును పెట్టుబడి సాధనంగా ఉపయోగించాలంటే సరైన అవగాహన అవసరమని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: ‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది


