దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగార్థులకు తీపి కబురు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో సుమారు 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలోనే ప్రధానంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
నియామకాల సంఖ్యలో కొంత మార్పు ఉండొచ్చని శెట్టి పేర్కొన్నారు. ఉద్యోగుల పదవీ విరమణలు, బ్యాంకు అవసరాలను బట్టి తుది సంఖ్య నిర్ణయిస్తామని, అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దాదాపు 12 వేల నియామకాలు ఉండొచ్చని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నియామకాలు తగ్గడానికి ప్రధాన కారణం ఐటీ విభాగంలో గతేడాది మాదిరిగా పెద్ద సంఖ్యలో నిపుణులు అవసరం లేకపోవడమేనని ఆయన తెలిపారు.
గతేడాది 25,633 మందికి ఉద్యోగాలు
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మొత్తం 25,633 మందిని నియమించుకుంది. ఇందులో 4,640 మంది అధికారులు, 19,340 మంది అసోసియేట్లు, 1,653 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా సుమారు 1,500 మంది స్పెషలిస్ట్ ఐటీ అధికారులను గతేడాది నియమించినట్లు శెట్టి చెప్పారు. మార్చి 2026 నాటికి ఎస్బీఐ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు పైగా ఉంది.
మరో 250 శాఖలు రావొచ్చు
ఉద్యోగ నియామకాలతో పాటు బ్యాంకు శాఖల నెట్వర్క్ను కూడా విస్తరించేందుకు ఎస్బీఐ సిద్ధమవుతోంది. కొత్త కాలనీలు ఏర్పడుతున్న ప్రాంతాలు, వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇంకా బ్యాంకింగ్ సేవలకు అవకాశం ఉందని శెట్టి తెలిపారు. కొన్ని శాఖలను హేతుబద్ధీకరించినప్పటికీ, నికరంగా ఏటా 200 నుంచి 250 శాఖలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది


